Kollu Ravindra: కృష్ణాజిల్లాలో టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు మరో మారు అరెస్టు చేశారు. మచిలీపట్నంలో అధికారులు ఆక్రమణల తొలగింపు చేస్తున్నారు. ఈ ఆక్రమణల తొలగింపు వ్యవహారం వివాదాస్పదమైంది. టీడీపీ సానుభూతిపరుల దుకాణాలను తొలగిస్తున్నారని ఆరోపిస్తూ టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఆక్రమణల తొలగింపును అడ్డుకునేందుకు రవీంద్ర ప్రయత్నించారు.
ఈ సందర్భంలో టీడీపీ నేతలు, పోలీసులకు మధ్య కొద్దిసేపు తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. బాధితులకు మద్దతుగా టీడీపీ నేతలు, కార్యకర్తలు భైటాయించి నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేసి అక్కడ నుండి తరలించారు.