Kondapalli Municipality: కొండపల్లి మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నిక వ్యవహారం తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. వైసీపీ ఆందోళనల నేపథ్యంలో రెండవ రోజు చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. నిన్న వైసీపీ కౌన్సిల్ హాలులో గొడవ చేసిన నేపథ్యంలో ఎన్నికల అధికారి నేటికి వాయిదా వేశారు. ఈ రోజు కూడా వైసీపీ సభ్యులు కౌన్సిల్ హాలులో ఎంపి కేశినేని నాని ఎక్స్ అఫిషియో ఓటును వ్యతిరేకిస్తూ ఆందోళన చేశారు. దీంతో ఎన్నికను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఎంపీ కేశినేని నానితో సహా టీడీపీ సభ్యుడు 14 మంది, ఇండిపెండెంట్ సభ్యుడు ఓ పక్క కూర్చోగా వైసీపీ సభ్యులు, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కౌన్సిల్ హాలులోకి వచ్చారు. కౌన్సిల్ హాలులో గొడవ అనంతరం వీరు వాకౌట్ చేశారు.
Kondapalli Municipality: ఎన్నికపై హైకోర్టు సీరియస్
మరో పక్క కొండపల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ మున్సిపాలిటీలో టీడీపీ, వైసీపీకి 14 – 14 కౌన్సిలర్ లు గెలుచుకోగా గెలిచిన మరో స్వతంత్ర అభ్యర్ధిని టీడీపీలోకి చేరిపోయారు. దీంతో హైకోర్టు ఆదేశాలతో ఎక్స్ అఫిషియో ఓటు వినియోగించుకునేందుకు విజయవాడ టీడీపీ ఎంపి కేశినేని నాని పాల్గొనగా వైసీపీ వర్గీయులు వ్యతిరేకిస్తున్నారు. ఎన్నిక వాయిదా పై టీడీపీ హైకోర్టులో లంచన్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. టీడీపీ తరుపున న్యాయవాది అశ్వనీకుమార్ వాదనలు వినిపించారు. ఎన్నిక జరగకుండా వైసీపీ నాయకులు విధ్వంసం సృష్టించారని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఈ పిటిషన్ పై వాదనలు విన్న ధర్మాసనం అక్కడి పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విజయవాడ సీపీ, కొండపల్లి మున్సిపల్ కమిషనర్ కోర్టుకు హజరు అయి వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ ఎన్నికపై హైకోర్టు ఎటువంటి డైరెక్షన్ ఇస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.