Krishna : రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని వాటిని అమలు చేశారు. నవరత్న పథకాల అమలునకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా అప్పులు తెచ్చి మరీ పంపిణీలు కొనసాగిస్తున్నారు. కానీ జర్నలిస్ట్ ల పట్ల జగన్ సర్కార్ చిన్న చూపు చూస్తోంది. జర్నలిస్ట్ సంఘాల నేతల ఆందోళనలు ఏ మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గతంలో అక్రిడిటేషన్ కమిటీలో అధికారులతో పాటు జర్నలిస్ట్ సంఘాల నేతలు సభ్యులుగా ఉండే వారు. తొలి సారిగా జగన్ సర్కార్ లో జర్నలిస్ట్ సంఘాలు లేకుండా అధికారులతో కమిటీని వేశారు. ఫిబ్రవరి నెల వస్తున్నా ఇంత వరకూ అర్హులైన జర్నలిస్ట్ లకు అక్రిడిటేషన్ లు మంజూరు చేయలేదు. తద్వారా వచ్చే బస్సు పాసులు ఇవ్వలేదు.
ఇప్పుడు తాజాగా కృష్ణా జిల్లాలో జరిగిన ఓ తాజా పరిణామం ప్రభుత్వ పెద్ద ఆగ్రహం వల్లనే జరిగిందని అనుకుంటున్నారు. గత నాలుగైదు సంవత్సరాల నుండి రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్ట్ పిల్లలకు ప్రైవేటు, ఎయిడెట్ పాఠశాలల్లో 50 శాతం ఫీజు రాయితీ ఇస్తున్నారు. ఇందుకు గానూ ఆయా జిల్లాల జిల్లా కలెక్టర్ ల ఆదేశాల మేరకు డీఈఓలు సంబంధిత విద్యాసంస్థలకు సర్క్యులర్ లు జారీ చేసేవారు. అదే విధంగా ఈ ఏడాది కూడా కృష్ణా జిల్లాలో జర్నలిస్ట్ ల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ సౌకర్యం కల్పిస్తూ నిన్న అంటే ఈ నెల 19వ తేదీన డిఈఓ ఎంవి రాజ్యలక్ష్మి సర్క్యులర్ జారీ చేశారు.
ఆ తరువాత ఏమి జరిగిందో ఏమో, ప్రభుత్వ పెద్దలు ఆగ్రహించారో గానీ 24 గంటలు గడవక ముందే ఈ రోజు (20వ తేదీ) ఆ ఉత్తర్వులు రద్దు చేస్తూ మరో సర్క్యులర్ జారీ చేశారు. రాయితీ ఇచ్చినట్లే ఇచ్చి మరుసటి రోజే తూచ్ ఆ ఉత్తర్వులు చెల్లవు అంటూ మరో ఉత్తర్వులు ఇవ్వడాన్ని జర్నలిస్ట్ సంఘాల నేతలు తప్పుబడుతున్నారు. ప్రభుత్వం జర్నలిస్ట్ ల పట్ల చిన్నచూపు చూస్తుంది అనడానికి ఇది మరొక ఉదాహారణ అని పేర్కొంటున్నారు.