Anandaiah: కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఉచితంగా నాటు మందు పంపిణీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కిన కృష్ణపట్నం ఆనందయ్యకు గ్రామస్తులు బిగ్ షాక్ ఇచ్చారు. అనుమతులు లేకుండా మందు పంపిణీ చేయడానికి వీలులేదంటూ గ్రామ ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బయటి ప్రాంతాల నుండి గ్రామాలకు జనాలు వస్తుండటంతో తాము ఇబ్బందులు పడుతున్నామని పలువురు గ్రామస్తులు పేర్కొంటున్నారు. తమ పిల్లలు అనారోగ్యాని గురవుతుండటంతో ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుందని అంటున్నారు. ఆనందయ్య సమక్షంలో గ్రామంలో పంచాయతీ పెట్టి ప్రభుత్వ అనుమతులు లేకుండా మందు పంపిణీ చేయడానికి వీలులేదని పేర్కొన్నారు. ఒక వేళ అనుమతులు ఉంటే ఊరి బయట మందు పంపిణీ ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ మేరకు ఆయన ఇంటి గ్రామస్తులు ఆందోళన చేశారు.
Anandaiah: ఆనందయ్య మందు పంపిణీపై గ్రామస్తుల ఆందోళన
ఒమిక్రాన్ వేరియంట్ కు తన వద్ద మందు ఉందని, పంపిణీ చేస్తున్నానంటూ ఆనందయ్య ప్రకటించారు. దాదాపు 22 రకాల దినుసులతో అయిదు రకాల మందులు తయారు చేసినట్లు తెలిపారు. ఒమిక్రాన్ రాకుండా ముందు జాగ్రత్తగా తీసుకునే మందు కూడా తయారు చేశామనీ, ఒకే రోజు రెండు పూటలా తీసుకుంటే చాలన్నారు. తాను ఇచ్చిన మందు తీసుకునే వారు 15 రోజుల పాటు మద్యం, మాంసం తీసుకోరాదని చెప్పారు. అయితే ఆనందయ్య ఇచ్చే మందు కోసం నిత్యం వివిధ ప్రాంతాల నుండి కృష్ణపట్నం వస్తుండటంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క ఆయుష్ శాఖ ఇటీవల ఓ ప్రకటన విడుదల చేసింది. ఒమిక్రాన్ వేరియంట్ కు మందు ఇస్తామని తమను ఎవరూ సంప్రదించలేదని సంబంధిత ఆయుష్ అధికారులు తెలిపారు. గుర్తింపు లేని వ్యక్తులు అందించే మందులను ఆయుర్వేద మందుగా బావించవచ్చని ఆయుష్ శాఖ స్పష్టం చేసింది.
ఈ ఏడాది కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆనందయ్య ఉచితంగా నాటు మందు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. తొలుత ప్రభుత్వం ఆయన మందు పంపిణీని అడ్డుకోవడంతో విపక్షాలు, ప్రజలు ఆయనకు మద్దతుగా నిలిచారు. ఆయుష్ శాఖ ఆయన తయారు చేసిన మందు పై పరీక్షలు జరిపి హనికరం కాదని తేల్చిన నేపథ్యంలో హైకోర్టు .. ఆనందయ్యకు మందు పంపిణీకి అనుమతి ఇచ్చింది. ఈ పరిణామాల క్రమంలో ఆనందయ్య రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు. ఆ ఫేమ్ తో ఆయన బీసీ ఎజెండాతో రాజకీయ పార్టీ పెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఆ విషయం చర్చల దశలో ఉండగా, గ్రామస్తులు ఆయనకు షాక్ ఇచ్చారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?