KTR : తెలంగాణ రాష్ట్ర మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ కొత్త టాస్క్ లో బిజీ అయిపోయారు. గత కొద్దికాలంగా జరుగుతున్న టీఆర్ఎస్ , బీజేపీ మాటల యుద్ధంలో భాగంగా తాజాగా ఈ ఇద్దరు మంత్రులు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష బీజేపీని ఓ రేంజ్లో టార్గెట్ చేశారు. ఆర్థిక మంత్రి హరీశ్ రావు నేరుగా పార్టీని విమర్శిస్తే ఐటీ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేసేలా ప్రతిపాదన పెట్టారు.
హరీశ్ రావు ఏమంటున్నారంటే…
మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల నియోజక వర్గం అభ్యర్థి వాణి దేవికి మద్దతుగా ఎన్నికల సన్నాహక సమావేశం ముఖ్య అతిధిగా మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… క్రూడాయిల్ తగ్గుతూ ఉంటే ఇక్కడ మాత్రం పెట్రోల్, డీజిల్ పెంచుతూ పోతున్నారని ఫైర్ అయ్యారు. పెట్రోలు ధరలను పెంచి ప్రజల నడ్డి విరిస్తోంది బిజెపి అని తెలిపారు. దేశంలో చాలా సంస్థలను బీజేపీ ప్రైవేటీకరణ చేస్తున్నదని..ఏపీలో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కూడా బీజేపీ ప్రైవేట్ పరం చేస్తున్నదని హరీశ్ రావు మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల ఉద్యోగాలు ఇస్తే అదే బీజేపీ లక్షల ఉద్యోగులు తొలగిస్తుందని ఫైర్ అయ్యారు. ఎన్నికలు ఉన్న బెంగాళ్,తమిళనాడు, కేరళకు మెట్రో ట్రైన్ ఇచ్చారని.. వాళ్ళకి కేటాయింపులు మనకి వాతలు పెట్టారని హరీశ్ రావు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో మేధావులు ఆలోచన చేయాలని కోరారు. బీజేపీకి గుణపాఠం చెప్పాలన్నారు. తమది ప్రశ్నించే గొంతు అంటున్న బీజేపీ నేతలు అదే ప్రశ్నిచే గొంతు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటాలను అడగాలని హరీశ్ రావు చురకలు అంటించారు.
కేటీఆర్ ఇంకో రూట్లో
గత ఆరు సంవత్సరాలుగా హైదరాబాద్ నగరం అద్భుతమైన ప్రగతి సాధిస్తుందని పేర్కొన్న తెలంగాణ మంత్రి కేటీఆర్.. హైదరాబాద్ నగరానికి ఐటిఐఆర్ లేదా ఐటిఐఆర్కు సమానంగా నూతన హోదాను కల్పించాలని కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్కు విజ్ఞప్తి చేశారు. ఐటీ ఎగుమతుల్లో జాతీయ సగటు కన్నా ఎన్నో రెట్లు వృద్ధిని హైదరాబాద్ నగరం కనబరుస్తుందన్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఐటీఐఆర్ పైన తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతోంది.. అయితే, కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదని పేర్కొన్న కేటీఆర్.. ఐటీఐఆర్ ను కొనసాగించే ఉద్దేశంలో కేంద్రం లేదని అర్థమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఐటిఐఆర్ కు సమానమైన నూతన పాలసీని ప్రకటించి హైదరాబాద్ కి ప్రోత్సాహం ఇవ్వాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. భారతదేశ ఆర్థిక ఇంజనీర్ గా హైదరాబాద్ లాంటి నగరాలు మారుతున్నాయని.. ఐటీ రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్న హైదరాబాద్ లాంటి నగరాలకు ప్రత్యేక పాలసీ ద్వారా కేంద్రం ప్రోత్సాహం అందించాలని కోరారు.