KTR : తెలంగాణ ముఖ్యమంత్రి , టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వర్సెస్ రాష్ట్రంలో బలపడాలని ప్రయత్నిస్తున్న బీజేపీ మధ్య గత కొద్దికాలంగా మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. అవకాశం దొరికిన ప్రతిసారి రాష్ట్ర సర్కారుపై బీజేపీ , కేంద్రంపై టీఆర్ఎస్ మండిపడుతోంది. తాజాగా కేంద్రం ప్రభుత్వంపై మరోసారి మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రతి విషయంలోనూ తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని మండిపడ్డారు. తెలంగాణకు అన్యాయం చేస్తున్నప్పుడు మీ గొంతు ఏమైందని రాష్ట్ర బీజేపీ నేతలపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. అయితే, ఈ కామెంట్లపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి ఫైరయ్యారు.
కేటీఆర్ ఏమంటున్నారంటే…
తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం గుండు సున్నా ఇచ్చిందని కేటీఆర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను ఇష్టానుసారంగా తిడుతున్నారని… తెలంగాణకు చేస్తున్న అన్యాయంపై ఎవరూ మాట్లాడటం లేదని పేర్కొన్నారు. లక్షల మంది పిల్లల నోట్లో మట్టి కొట్టారని బీజేపీ నాయకులపై నిప్పులు చెరిగారు. బీజేపీ ప్రభుత్వంలో జీడీపీ అంటే గ్యాస్, డీజిల్, పెట్రోల్ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే…
మంత్రి కేటీఆర్ కామెంట్ల నేపథ్యంలో ఎంపీ రేవంత్ రెడ్డి ఆయనకు బహిరంగ లేఖ రాశారు. మీదీ, బీజేపీది ఆత్మ ఒక్కటే శరీరాలే వేరు అంటూ రేవంత్ విరుచుకపడ్డారు. “ఎన్నికలప్పుడు కుస్తీ, తర్వాత దోస్తీ… ఏడేళ్లుగా మీరు చేస్తున్నది ఇదే . గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల సందర్బంగా మీ తండ్రి బీజేపీ పై యుద్ధం అన్నారు… తర్వాత ఢిల్లీ వెళ్లి మోదీతో రాజీ పడ్డారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మీరు మళ్లీ బీజేపీ పై యుద్ధం అంటున్నారు. ఉత్తర కుమారుడిలా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారు “ అంటూ రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు.
“మీరు బీజేపీ ఒక్కటి కాకపోతే… నాదొక సవాల్ . ఐటీఐఆర్, విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరవదిక నిరహార దీక్షకు మీరు సిద్ధమా. ఈ నెల 8న పార్లమెంట్ మలి విడత సమావేశమవుతోంది… దీక్షతో మోదీ పై ఒత్తిడి పెంచుదాం వస్తారా – రేవంత్. నా సవాల్ కు స్పష్టమైన సమాధానం ఇవ్వండి… మీ దొడ్లో కుక్కలతో మొరిగించే ప్రయత్నం చేయవద్దు. ఈ సవాల్ ను మీరు స్వీకరించకుంటే మోదీ తొత్తులుగా, తెలంగాణ ద్రోహులుగా శాశ్వతంగా మిగిలిపోతారు“ అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు.