YS Sharmila:తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతూ…యువతపై ప్రత్యేకంగా దృష్టి రాష్ట్ర రాజకీయాల్లో సత్తా చాటుకోవాలని భావిస్తున్న వైఎస్ షర్మిల ఈ మేరకు గత కొద్దికాలంగా తన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. చస్తేనే ఉద్యోగాలు ఇస్తారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకోవద్దు. మీ కోసం వైఎస్సార్ టీపీ కొట్లాడుతుంది అని ఆ పార్టీ నేతలు హామీ ఇస్తున్నారు. ఇలా షర్మిల యువతకు భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే, షర్మిల పార్టీపై తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ నేత కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read More: YS Sharmila: షర్మిల బ్యాడ్ టైం కాకపోతే మరేంటి!
కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు…
రాష్ట్రంలోని పరిణామాలపై మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ షర్మిల పార్టీపై కూడా స్పందించారు. ప్రస్తుతం ఉన్న సీజన్ లో అందరు వ్రతాలు, పూజలు చేసినట్టు షర్మిల ఓ రోజు పెట్టుకొని వచ్చి దీక్ష చేసి పోతుంటారు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. షర్మిల పార్టీ ఎంతో ప్రభావం చూపుతుందని తాను భావించడం లేదన్నారు. తెలంగాణపై ప్రేమ , బాధ్యత ఉన్న పార్టీ టీఆర్ఎస్ ఒక్కటేనని కేటీఆర్ తెలిపారు.
Read More: KTR: ముందు కేటీఆర్…తర్వాత షర్మిల ఏం జరిగిందంటే…
ఈటల గురించి ఏమంటున్నారంటే…
ప్రతిపక్షాలకు ఏం మాట్లాడాలో తెలియక ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ లో ఉండేలా తాను వ్యక్తిగతంగా చివరి వరకు ప్రయత్నించానని కేటీఆర్ చెప్పారు. ఈటల రాజేందర్ కు టీఆర్ఎస్ పార్టీ ఎంత ఇచ్చిందో ఆత్మ విమర్శ చేసుకోవాలని కేటీఆర్ సూచించారు. ఈటల రాజేందర్ పై సానుభూతి ఎందుకు, ఎట్లా వస్తుంది అని కేటీఆర్ ఆసక్తికర ప్రశ్న వేశారు. హుజురాబాద్ లో పోటీ పార్టీల మధ్య ఉంటుంది తప్ప వ్యక్తుల మధ్య కాదు అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.