Kuppam: టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గాన్ని వచ్చే ఎన్నికల్లో కైవశం చేసుకోవాలనేది వైెఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక సిద్దం చేస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన గెలుపును చూసి ఇక కుప్పంలో వైసీపీ బలపడింది భావిస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా కుప్పంలో వైసీపీ అభ్యర్ధిగా ఎవరు నిలబడబోతున్నారు..? ఇప్పుడు ఉన్న వైసీపీ ఇన్ చార్జి భరత్ కు టికెట్ కన్ఫర్మ్ చేస్తున్నారా.? లేదా.. కుప్పం వైసీపీలో అంతర్గతంగా ఏమి జరుగుతోంది..? అని పరిశీలన చేస్తే..
Kuppam: పెద్దిరెడ్డి ఫ్యామిలీ నుండే..?
ఎవరు అభ్యర్ధి అయినా చంద్రబాబు ఓడిపోవాలి. నెక్ట్స్ అసెంబ్లీలోకి చంద్రబాబు అడుగు పెట్టకూడదు. ఇది ఒక్కటే సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి, అక్కడి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టార్గెట్. అందుకే తన కుటుంబం నుండే ఒకరిని దింపాలని పెద్దిరెడ్డి ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే పెద్దిరెడ్డి ఫ్యామిలీ చిత్తూరు జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో ఉంది. తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, పుంగనూరు నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా ఉన్నారు. రాజంపేట ఎంపిగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఉన్నారు. ఆ కుటుంబం నుండి ఇప్పటికే మూడు సీట్లు ఉన్నాయి. ఇప్పుడు నాల్గవ సీటు కుప్పం నుండి కూడా పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డిని పోటీ చేయించాలని ఆలోచన చేస్తున్నారు. యువ నాయకుడు పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడి కుమారుడు. ఈ విషయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆలోచనను సీఎం జగన్మోహనరెడ్డి కాదనే పరిస్థితి లేదు. ఎందుకంటే పెద్దిరెడ్డికి జగన్ పూర్తి స్థాాయి స్వేచ్చ ఇచ్చేశారు.
Kuppam: వన్యకుల క్షత్రియ ఓటింగ్ కీలకం
కుప్పంలో సామాజిక సమీకరణాలు చూసుకుంటే వన్యకుల క్షత్రియ ఓటింగ్ ఎక్కువ. దాదాపు 65 నుండి 70వేల ఓట్లు ఈ సామాజిక వర్గ ఓట్లు ఉన్నాయి. వీళ్లు బీసీ సామాజికవర్గం కింద వస్తారు. వీళ్లతో పాటు బలిజ (కాపు) సామాజిక వర్గ ఓట్లు ఎక్కువ. ఈ సామాజికవర్గం 40 నుండి 42 వేల వరకూ ఉంటారు. ఈ రెండు సామాజిక వర్గాలతో పాటు ఇతర బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గ ఓట్లు ఎక్కువగానే ఉన్నాయి. మొత్తం మీద రెడ్డి, కమ్మ సామాజికవర్గ ఓట్లు చాలా తక్కువ. రెడ్డి సామాజికవర్గం కంటే కమ్మ సామాజికవర్గం ఓట్లు తక్కువే. రెడ్డి కమ్యూనిటీ వాళ్లు 15 నుండి 20వేల వరకూ ఉంటే..కమ్మ సామాజికవర్గం మాత్రం 5 నుండి 6వేల వరకూ మాత్రమే ఉంటారు.
Kuppam: ఇతర సామాజికవర్గాలకు పదవులు
అక్కడ వన్యకుల క్షత్రియ సామాజికవర్గానికి చెందిన భరత్ కు వైసీపీ ఎమ్మెల్సీ ఇచ్చింది. అదే విధంగా బలిజ సామాజికవర్గానికి చెందిన కొందరికి నామినేటెడ్ పదవులు ఇచ్చారు. దానితో పాటు మున్సిపల్ చైర్మన్ గా బీసీ సామాజికవర్గ నేతకు అవకాశం ఇచ్చారు. మూడు సామాజికవర్గాల వారికి మూడు భిన్నమైన పదవులు ఉన్నాయి. ఇప్పుడు రెడ్డి సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి ఎమ్మెల్యేగా ప్రకటిస్తే ఇతర సామాజికవర్గాలకు పదవులు ఇచ్చినందున సామాజిక న్యాయం చేసినట్లు ఉంటుంది. దీంతో కుప్పం ఈజీగా గెలవవచ్చు అని వైసీపీ లెక్క. వచ్చే ఎన్నికల నాటికి కుప్పంలో వైసీపీ వ్యూహాలు ఇలా ఉన్నాయి.