Kuppam municipal election: టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలో రాజకీయం హాట్ హాట్ గా మారింది. వరుస విజయాలతో జోష్ మీద ఉన్న వైసీపీ కుప్పం మున్సిపాలిటీని కైవశం చేసుకుని చంద్రబాబును సొంత గడ్డపైనే పరువు తీయాలని వ్యహాత్మకంగా అడుగులు వేస్తుంది. మున్సిపాలిటీలో తమ సత్తా చాటి పట్టు నిలుపుకోవాలన్న ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభానికి నెల రోజుల ముందు నుండే వైసీపీ చైర్మన్ అభ్యర్ధి డాక్టర్ సుధీర్, టీడీపీ చైర్మన్ అభ్యర్ధి త్రిలోక్ తమ వార్డు సభ్యులతో ప్రచారాన్ని నిర్వహించారు. నిన్నటి నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయ్యింది.
Kuppam municipal election: కుప్పంలోనే మంత్రి పెద్దిరెడ్డి మకాం
ఈ మున్సిపల్ ఎన్నికల్లో సైకిల్ సత్తా చాటుతుందా ? లేక మళ్లీ ఫ్యాన్ గాలే వీస్తుందా ?అన్న దానిపై ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. కుప్పం ఎన్నికను రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మున్సిపల్ వార్ ఒక రేంజ్ లో ఉంటుందనేది స్పష్టం అవుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో ఓటమి రుచి చూపించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన తమ్ముడు తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి ని సీన్ లోకి దింపారు. కనీసం ఈ ఎన్నికలలోనైనా గెలిచి తమ పరువు నిలుపుకోవాలని టీడీపీ భావిస్తోంది. ఈ క్రమంలో భాగంగా ఇటీవల చంద్రబాబు కుప్పంలో పర్యటించి పార్టీ క్యాడర్ లో జోష్ నింపారు. ఎన్నికలపై దిశా నిర్దేశం చేశారు. ప్రస్తుతం కుప్పంలో పెద్దిరెడ్డి వర్సెస్ చంద్రబాబు అన్నట్లుగా సీన్ మారింది. నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయిన తరువాత మంత్రి పెద్దిరెడ్డి కుప్పంలోనే మకాం వేయాలని భావిస్తున్నారు. పరిషత్ ఎన్నికల తరహాలోనే మున్సిపాలిటీలోనూ క్లీన్ స్పీప్ చేయాలన్నది పెద్దిరెడ్డి లక్ష్యంగా ఉంది. కాగా మరో వైపు వైసీపీ దూకుడుకు అడ్డుకట్ట వేయాలని టీడీపీ లక్ష్యంగా పెట్టుకుంది. నలుగురు రాష్ట్ర స్థాయి నాయకులకు బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది. నాయకుల సమన్వయ బాధ్యతలను పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుకి చంద్రబాబు అప్పగించారు.
కుప్పం మున్సిపాలిటీ ముఖ చిత్రం
మున్సిపాలిటీగా ఆవిర్బవించిన సంవత్సరం – 2019
పట్టణ జనభా సుమారు 60వేలు
వార్డుల సంఖ్య – 25
మొత్తం ఓటర్లు – 39,261
మహిళా ఓటర్లు -19,891
పురుష ఓటర్లు – 19,358
ఇతరులు -12
కాగా 15వ తేదీ ఉదయం7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. 16వ తేదీ అవసరమైన పోలింగ్ బూత్ లలో రీపోలింగ్. 17వ తేదీ ఉదయం 8గంటల నుండి ఓట్ల లెక్కింపు జరగనుంది.