kurupam YCP : విజయనగరం Vijayanagaram జిల్లా కురపాం కోటలో మామ కోడళ్ల ఇంటి విబేధాలు తారా స్థాయికి చేరాయి. గత కొంత కాలంగా డిప్యూటి సీఎం పాముల పుష్పశ్రీ వాణి, ఆమె మామ మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు మధ్య నడుస్తున్న వార్ తారా స్థాయికి చేరింది. దాదాపు ఏడు ఎనిమిది నెలలుగా మామ కోడళ్ల మద్య విబేధాలు కొనసాగుతున్నా ఇద్దరు వైసీపీలోనే కొనసాగుతున్నారు. గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది. చంద్రశేఖర్ రాజు వైసీపీకి రాజీనామా చేశారు. జిల్లాలో ఇది హాట్ టాపిక్ అయ్యింది. కారణం ఇంటి విబేధాలు అని అందరూ అనుకుంటున్నా వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాల కారణంగా రాజీనామా చేస్తున్నానంటూ చంద్రశేఖర్ రాజు ప్రకటించడం గమనార్హం. కార్యకర్తల సమావేశం అనంతరం ఏ పార్టీలో చేరేది ప్రకటిస్తానని చంద్రశేఖర్ రాజు వెల్లడించారు.
విషయంలోకి వెళితే.. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చంద్రశేఖర్ రాజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాగూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యగా గెలిచారు. ఆ తరువాత జిల్లాలో కీలక నేతల్లో ఒకరుగా పేరు తెచ్చుకున్నారు. వైఎస్ మరణానంతరం జరిగిన పరిణామాల్లో కొన్నాళ్ల పాటు చంద్రశేఖర్ రాజు రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. 2017 సంవత్సరంలో టీడీపీ లో చేరి క్రియాశీలకంగా పని చేశారు. అయితే 2019 ఎన్నికల్లో చంద్రశేఖర్ రాజు తన కుమార్తె కు టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కోడలు పుష్ప శ్రీవాణి గెలుపునకు సహకరించారు. ఎన్నికల్లో గెలిచిన పుష్పశ్రీ వాణికి సీఎం జగన్ డిప్యూటి సీఎం పదవి ఇచ్చారు. ఆ తరువాత ఏడాదిలోపే మామ కోడళ్లు మధ్య విబేధాలు వచ్చాయి. మీడియా సమావేశం పెట్టి మరీ కోడలు పుష్పశ్రీ వాణి నియోజకవర్గంలో ఏమి చేయడం లేదంటూ చంద్రశేఖర్ రాజు విమర్శించారు. ప్రభుత్వం, పార్టీ, కోడలు పని తీరుపైనా బహిరంగంగా విమర్శలు చేయడం జిల్లాలో చర్చనీయాంశమయ్యింది.
అయితే మామ చేసిన విమర్శలపై పుష్పశ్రీ వాణి స్పందించలేదు కానీ ఆమె భర్త పరిక్షిత్ రాజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన తండ్రి వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్యానించారు. అయితే మామ, కోడలు మధ్య విబేధాలను పరిష్కరించేందుకు పార్టీ అధిష్టానం దృష్టి సారించలేదన్న మాటలు కూడా వినపడ్డాయి. అయితే చంద్రశేఖర్ రాజు పార్టీ నుండి బయటకు వెళ్లాలని నిర్ణయించుకునే పార్టీపైనా, కోడలిపైనా విమర్శలు చేస్తున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ మంత్రి వర్గంలో పుష్పశ్రీ వాణి కీలకంగా వ్యవహరిస్తున్నారు. కోడలు ఉన్న పార్టీలోనే తాను కొనసాగితే రాబోయే రోజుల్లో తన కుమార్తెకు రాజకీయ భవిష్యత్తు ఉండదని చంద్రశేఖర్ రాజు భావించి పార్టీ నుండి బయటకు వెళ్లడానికి వివాదాన్ని రేపారా అన్న మాటలు కూడా వినబడుతున్నాయి. పార్టీ అంతర్గత విబేధాలపై అధిష్టానం దృష్టి పెట్టకపోవడం వల్లనే ఈ పరిణామం చోటుచేసుకుందని కూడా కొందరు అంటున్నారు.
విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు నివాసంపై రెండు పార్టీల జెండాలు ఎగిరినట్లే మరి కొద్ది రోజుల్లో విజయనగరం జిల్లా కురుపాం కోటపైనా రెండు పార్టీల జండాలు ఎగిరే అవకాశం ఉందని అనుకుంటున్నారు. అయ్యన్నపాత్రుడు టీడీపీలో ఉండగా ఆయన సోదరుడు సన్యాసినాయుడు వైసీపీలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో తమ్ముడు ఒక పార్టీలో అన్న మరొక పార్టీలో, తండ్రి ఒక పార్టీలో కొడుకు మరొక పార్టీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు విజయనగరం జిల్లాలో మామ ఒక పార్టీలో కోడలు మరొక పార్టీలో ఉండటంతో రెండు పార్టీల జండాలు ఆ ఇంటిపై ఎగిరే అవకాశం ఉందని అంటున్నారు.