తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంగా ఓ సంచలన వార్త ఆయన రాజకీయ ప్రత్యర్థులు వైరల్ చేస్తున్నారు. గులాబీ దళపతికి ఊహించని రీతిలో పరిణామాలు మారుతున్నాయని అంటున్నారు.
త్వరలో జరుగనున్న నాగార్జునసాగర్ ఉప ఎన్నికలోనూ టీఆర్ఎస్ గెలిచే చాన్స్ లేదని ఆ పార్టీ సొంత సర్వేలో తేలినట్లు సోషల్ మీడియాలో ఓ సర్వేను చెలామణిలో పెట్టారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ఇప్పుడు నాగార్జున సాగర్ బై ఎలక్షన్పై ఫోకస్ పెట్టిందని అదే సమయంలో కాంగ్రెస్ సైతం అక్కడ బలంగా ఉందని సర్వేలో తేలినట్లు చెప్పుకొస్తున్నారు.
సాగర్ సర్వే ఏమంటోంది ?
నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కన్నుమూయడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యంగా మారిన సంగతి తెలిసిందే. జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే చాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో సాగర్లో రాజకీయ పరిస్థితిపై టీఆర్ఎస్ ఓ సర్వే నిర్వహించినట్లు తెలిసింది. పార్టీ నుంచి ఎవరికి టికెట్ ఇవ్వాలనే అంశంపై ఆరా తీసినట్లు సమాచారం. తమ పార్టీ గెలుపు కష్టమనే విషయం సర్వేలో తేలినట్లు టీఆర్ఎస్ లీడర్లు చర్చించుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి వైపే ప్రజలు మొగ్గుచూపుతున్నట్లు, ఆయనే ఫస్ట్ ప్లేస్లో ఉన్నట్లు కొందరు ప్రచారం స్టార్ట్ చేశారు.
టీఆర్ఎస్ పార్టీ నేతల సంగతి ఏంటి?
టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్న ఎంసీ కోటిరెడ్డికి సర్వేలో రెండో స్థానం దక్కినట్లు.. జానారెడ్డి, కోటిరెడ్డి మధ్య దాదాపు 15 నుంచి 20 శాతం ఓట్ల తేడా ఉన్నట్టు వారు చెబుతున్నారు. ఆ తర్వాత స్థానాల్లో తేరా చిన్నప రెడ్డి, నోముల భగత్ (నోముల నర్సింహయ్య కొడుకు), మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఉన్నట్టు వారు పేర్కొంటున్నారు. ఇంతకీ ఈ సర్వే విశ్వసనీయత ఏంటి ? గెలుపు ఓటములు ఎలా ఉండనున్నాయి అనేది తేలాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.