తెలంగాణ ముఖ్యమంత్రి , టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రాజకీయ చాణక్యం గురించి తెలుగు రాష్ట్రాలలో రాజకీయాల గురించి తెలిసిన వారికే కాదు…. సాధారణ పౌరులకు కూడా పరిచయం చేయనవసరం లేదు!.
కేసీఆర్ ఎత్తుగడలు , నిర్ణయాలు అలాంటివి మరి!! అలాంటి కేసీఆర్ తీసుకున్న ఒక్క నిర్ణయం రాజకీయంగా ఓ రేంజ్లో టార్గెట్ చేస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా ప్రత్యర్థులు విరుచుకుపడేందుకు సదరు టూరు , అనంతరం పరిస్థితులు కారణంగా మారిపోయాయని చెప్పుకొస్తున్నారు.
కేసీఆర్ … ఎందుకిలా చేశారు ?
ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ హఠాత్తుగా ఢిల్లీ వెల్లిన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ , కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సహా పలువురు మంత్రులను ఆయన కలిశారు. అయితే, ఈ టూర్ కు కొద్దిరోజుల ముందే బీజేపీపై కేసీఆర్ సమర శంఖారావం పూరించారు. రైతుల ఆందోళనలపై ఘాటుగా స్పందించారు. అలాంటి నేత కేంద్ర పెద్దలతో కలవడం ఏంటనే చర్చ జరిగింది. మరోవైపు మునుపటి స్థాయిలో , అదే రీతిలో కేసీఆర్ స్పందించకపోవడంతో ఇప్పటికీ విపక్షాలు విరుచుకుపడుతున్నాయి.
మళ్లీ మళ్లీ … కేసీఆర్ పై అదే లొల్లి …
తెలంగాణ సీఎం కేసీఆర్ పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తాజాగా మళ్లీ విరుచుకుపడ్డారు. వ్యవసాయ చట్టాలు మారలేదు…కానీ కేసీఆర్ మారిపోయారని అన్నారు. కేంద్రం – రాష్ట్రాల మధ్య ఫెడరల్ స్ఫూర్తి కూడా లేకుండా బీజేపీ చేస్తుందన్న ఆయన ఫెడరల్ ఫ్రంట్ తయారుచేస్తానన్న కేసీఆర్… ఢిల్లీకి వెళ్లి వచ్చి బిల్లులకు మద్దతు పలికారని ఆరోపించారు. తన స్వార్థం కోసం రైతుల సమస్యల్ని మోడీ దగ్గర తాకట్టు పెట్టారని భట్టి విక్రమార్క విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పెట్టిన కొనుగోలు కేంద్రాలు ఎత్తేయాలని కేసీఆర్ చూస్తున్నారని, కొనుగోలు కేంద్రాల ఎత్తివేతను సహించమని అన్నారు. అసెంబ్లీ ని సమావేశపరచాలని సీఎం కేసీఆర్ను డిమాండ్ చేసిన భట్టి కేంద్ర చట్టాలు వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని కోరారు. ప్రభుత్వం ముందుకు రాకుంటే..మేమే ప్రయివేటు బిల్లును ప్రవేశ పెడతామని అన్నారు. బీజేపీ వ్యాపారస్తుల పార్టీ అని ఆరోపించిన భట్టి విక్రమార్క అందుకే వ్యాపారస్తుల చేతిలోకి ఆర్థిక వ్యవస్థ పెడుతుందని వ్యవసాయాన్ని కార్పొరేట్ లకు అప్పగించే కుట్రలో భాగమే కొత్త చట్టాలు అని అన్నారు.