Liquor door delivery: గత ఏడాది కరోనా లాక్ డౌన్ సమయంలో తీసుకున్న కఠిన నిర్ణయాల కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాల ఆదాయాలను కోల్పోయాయి. అనేక సేవలు నిలిచిపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అయితే ముఖ్యంగా లాక్ డౌన్ సమయంలో మందు బాబుల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే నాటు సారా, కాల్తీ సారా విక్రయాలు చాటుమాటుగా సాగగా, కొన్ని చోట్ల మందు దొరకక దానికి బానిసలు అయిన వారు కొందరు మత్తు కోసం శానిటైజర్ లు వంటివి తాగి మృత్యువాత పడిన ఘటనలు ఉన్నాయి. కొందరైతే మందు దొరక్క పిచ్చిపట్టి వింత చేష్టలతో ఇబ్బందలు పడ్డారు. వారిని మెంటల్ ఆసుపత్రికి తరలించి వైద్యం కూడా అందించారు.
ప్రధానంగా ఏ రాష్ట్ర ప్రభుత్వాలకైనా మద్యం షాపుల ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంటుంది. లాక్ డౌన్ లాంటి కఠిన నిర్ణయాల సమయంలో మద్యం షాపులు మూసివేయడం వల్ల ప్రభుత్వాలు ఆదాయం భారీగా కోల్పోవడంతో పాటు వాటికి అలవాటుపడిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ప్రస్తుత కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో చాలా రాష్ట్రాలు లాక్ డౌన్, కర్ఫ్యూ వంటి ఆంక్షలన విధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భాగంగా చత్తీస్ఘడ్ కూడా లాక్ డౌన్ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తోంది. కొన్ని అత్యవసర సేవలు మినహా అన్ని సేవలను పూర్తిగా నిలిపివేసింది.
అయితే మద్యం విక్రయాల విషయంలో ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకున్నది. మద్యం డోర్ డెలివరీ (ఇంటికే) అందించాలని అక్కడి ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకున్న వారికి లిక్కర్ సేవలు అందిస్తామని అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఉదయం 9గంటల నుండి రాత్రి 8గంటల వరకూ లిక్కర్ హోమ్ డెలవరీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లిక్కర్ హోమ్ డెలివరీ బాధ్యతలను చత్తీస్ఘడ్ రాష్ట్ర మార్కెటింగ్ కార్పోరేషన్ (సీఎస్ఎంసీఎల్) చేపట్టింది. సీఎస్ఎంసీఎల్ వెబ్ సైట్ లో ప్రీపెయిడ్ ద్వారా హోం డెలివరీ సదుపాయాన్ని పొందవచ్చని తెలిపింది. ఒక్కో వినియోగదారుడికి గరిష్టంగా అయిదు లీటర్ల మద్యాన్ని సరఫరా చేస్తామని వెల్లడించింది. గత లాక్ డౌన్ సమయంలోనూ ఈ రాష్ట్రంలో మద్యాన్ని హోం డెలివరీ సదుపాయాన్ని చేపట్టింది. అయితే అక్కడి అధికార కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై బీజేపీ మండిపడుతోంది.
ఏ రాష్ట్రంలో అయినా అక్కడి ప్రభుత్వాలు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సహజమే. కానీ ఒక విధంగా చూసుకుంటే చత్తీస్ఘడ్ రాష్ట్రం తీసుకున్న నిర్ణయం మంచిదేనని అంటున్నారు కొందరు. వివిధ రాష్ట్రాలలోని మందు బాబులు ఇటువంటి నిర్ణయాన్ని స్వాగతించడం ఖాయమే.
తెలంగాణలో కొంత వెసులుబాటు
తెలంగాణలో రేపటి నుండి కరోనా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. చత్తీస్ ఘడ్ మాదిరిగా డోర్ డెలివరీకి అయితే అనుమతి ఇవ్వలేదు కానీ మద్యం షాపుల్లో విక్రయాలకు రిలీఫ్ టైమ్ లో పర్మిషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఉదయం 6గంటల నుండి పది గంటల వరకూ మద్యం షాపుల్లో విక్రయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. రేపు ఉదయం నుండి లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటన వెలువడినప్పటి నుండి తెలంగాణలో మద్యం షాపుల ముందు మందుబాబులు బారులు తీరారు. మళ్లీ షాపులు ఎప్పుడు తీస్తారో ఏమోనని కేసులు కేసులు కొనుగోలు చేసుకుని ఇళ్లకు తీసుకువెళుతున్నారు కొందరు. మద్యం కోసం మందుబాబుల మధ్య తోపులాట చోటుచేసుకుంటుండగా భౌతిక దూరం అనేది ఎక్కడా కనిపించడం లేదు. దీంతో మద్యం డోర్ డెలివరీకి అనుమతి ఇవ్వాలంటూ వైన్ షాపుల అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. దీనిపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.