Local Body Elections : ఒక నాడు క్రమశిక్షణకు మరో పేరు తెలుగుదేశం పార్టీ. కానీ ఇప్పుడు అధినేత చంద్రబాబు నిర్ణయానికే దిక్కార స్వరం వినిపిస్తోంది. టీడీపీ చరిత్రలో మొట్టమొదటి సారి స్థానిక సంస్థల బహిష్కరణ నిర్ణయం తీసుకోవడం ఆ పార్టీలో నేతలు, కార్యకర్తలకు రుచించడం లేదు. నామినేషన్ ల ప్రక్రియ ఎప్పుడో పూర్తి అయి పోయినందున టీడీపీ ఎన్నికలను బహిష్కరించినా బ్యాలెట్ పేపరుపై ఎన్నికల గుర్తు, అభ్యర్థి పేరు ఉంటాయి. దీంతో గతంలో నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు చాలా ప్రాంతాల్లో పోటీ నుండి తప్పుకోవడానికి ఇష్టపడటం లేదు. గెలుపు ఓటములు సహజం, గెలుస్తే గెలుస్తాం లేక పోతే ఓడిపోతాం పోటీ నుండి ఎందుకు తప్పుకోవాలని భావిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ద్వితీయ శ్రేణి నాయకుల మనోభీష్టానికి అనుగుణంగా నియోజకవర్గ నాయకులు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో టీడీపీ అభ్యర్థులు ప్రచారంలో కూడా నిమగ్నమైపోయారు.
జడ్ పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు అధికారికంగా చంద్రబాబు ప్రకటించినా సాంకేతికంగా పోటీలో ఉన్నట్లే లెక్క. అభ్యర్థులకు బీ ఫాం ఇవ్వకముందు పార్టీ బహిష్కరణ నిర్ణయం తీసుకుంటే పోటీలో లేనట్లు అవుతుంది. కాకపోతే పార్టీ పరంగా బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడం వల్ల ఆ పార్టీ అభ్యర్థులకు ఎన్నికల ఖర్చు ఇవ్వకుండా తప్పుకోవచ్చు. అభ్యర్థులు వారి సొంత ఖర్చులతో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిందే. విశాఖ, విజయనగరం, తూర్పు గోదావరి, గుంటూరు. కృష్ణా తదితర జిల్లాలలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా టీడీపీ అభ్యర్థులు తాము పోటీలో ఉన్నట్లు ప్రకటించుకుని ఓటర్లను కలుసుకుంటూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అభ్యర్థులకు బీ ఫాంలు ఇచ్చి ఉన్నందున పార్టీ కోసం ప్రచారం చేసే వారిపై, పోటీలో ఉన్న వారిపై చర్యలు అవసరం లేదని ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొంటున్నారు.
ఇదిలా ఉంటే చంద్రబాబు తీసుకున్న ఎన్నికల బహిష్కరణ నిర్ణయంపై వైసీపీ నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఎలాగైనా ఓడి పోవడం ఖాయమని తెలిసే ముందుగానే పోటీ నుండి తప్పుకున్నట్లు ప్రకటించారని అంటున్నారు. టీడీపీ పోటీ లో ఉన్న మున్సిపల్ ఎన్నికల మాదిరిగానే వైసీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని వైసీపీ నేతలు ఢంకా భజాయించి చెబుతున్నారు. మరో పక్క బీజేపీ, జనసేన హైకోర్టులో దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ లతో మరి కొన్ని పిటిషన్ లపై నేడు విచారణ జరిగింది. ఈ రోజు పిటిషన్ ల తరపు వాదనలు పూర్తి కాగా విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. రేపు ఎస్ఈసీ తరపు వాదనలు పూర్తి అయిన తీర్పు వెలువడే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ పై నేడు ఎస్ఈసీ అఫిడవిట్ దాఖలు చేసింది. ఇప్పుడు అందరి చూపు హైకోర్టుపై ఉంది. హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.