Local Body Elections : రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల సహకారంపై చర్చించేందుకు ఎస్ఈసీ నీలం సాహ్ని సమావేశం ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి క్రితం ఎన్నికల సంఘ కార్యాలయంలో సమావేశం ప్రారంభం అయ్యింది. ఈ సమావేశానికి టీడీపీ, బీజేపీ, జనసేన, సీపీఐ బహిష్కరించాయి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన తరువాత అఖిలపక్ష సమావేశం ఎందుకని ఈ పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా ఎన్నికల నోటిఫికేషన్ కు వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో నిన్ననే ఎన్నికల నిర్వహణపై నోటిఫికేషన్ విడుదల చేసి నేడు అఖిలపక్ష సమావేశం అంటూ ఎస్ఈసీ.. పార్టీలను ఆహ్వానించడంతో ఈ పార్టీలు సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి.
ఇప్పటికే జనసేన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను మొదటి నుండి ప్రారంభించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ఇంకా హైకోర్టులో పెండింగ్ లో ఉన్నది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఏడాది క్రితం నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ ప్రక్రియలు పూర్తి అయ్యాయి. దీంతో నేరుగా ఈ నెల 8వ తేదీ పోలింగ్, 10 వ తేదీ లెక్కింపునకు ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. అవసరం అయితే 9వ తేదీ రీపోలింగ్ నిర్వహించనున్నారు. కాగా ఎస్ఈసీ ఏర్పాటు చేసిన సమావేశానికి వైసీపీ తరపున లేళ్ల అప్పిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుండి మస్తాన్ వలీ, సీపీఎం నుండి వైవి రావు, టీఆర్ఎస్ ఆదినారాయణ హజరైయ్యారు.
మరో పక్క ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలా, లేక బహిష్కరించాలా అన్న విషయంపై టీడీపీ సమాలోచనలు చేస్తున్నది. నేడు చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న పొలిట్ బ్యూరో సమావేశంలో దీనిపై ఒక నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది. కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని వివిధ రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తుండగా ఎస్ఈసీ పాత నోటిఫికేషన్ అధారంగా ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవడంపై ఆయా పార్టీల నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.