Lokesh Anantapur tour: రాజకీయాలలో శాశ్వత శతృత్వం, శాశ్వత మితృత్వం ఉండదు అనేది నానుడి. ప్రత్యర్ధులుగా తిట్టుకున్న వాళ్లే ఆ తరువాత ఒకే పార్టీ కలిసి ప్రయాణిస్తూ స్నేహంగా కొనసాగుతున్న సందర్భాలు ఉన్నాయి. రాయలసీమలోని ఫ్యాక్షన్ గ్రామాల్లో, గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో మాత్రం గతంలో ఒక వర్గంలో ఒక పార్టీలో ఉండే మరో వర్గం ఉంకో పార్టీ లో ఉంటుండేది. వాళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండేది. అయితే ఇతర ప్రాంతాల్లో నాయకులు మాత్రం పార్టీలు వేరైనా ఎదురెదురు పడిన సందర్భాల్లో మాట్లాడుకునే వారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ రాయలసీమలో ఫ్యాక్షన్ నేతలు గ్రూపులుగా ఒకరు అంటే ఒకరు పడని విధంగానే ఉండే వారు.
Lokesh Anantapur tour: అనంతలో చంద్రబాబు చొరవ
అయితే రాష్ట్ర విభజన తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు చొరవతో రాయలసీమలోని పలువురు ఫ్యాక్షన్ నేతలు వారి వారి పాత వైరాలను పక్కన పెట్టి కలిసి పని చేయడానికి సిద్ధమైయ్యారు. రాయలసీమలోని అనంతపురం జిల్లాలో పరిటాల, జేసి కుటుంబాలకు ఫ్యాక్షన్ నేపథ్యం ఉండేది. జేసి వర్గానికి, పరిటాల వర్గానికి ఎంతో శత్రుత్వం ఉంది. పరిటాల కుటుంబం టీడీపీలో ఉండగా, జేసి ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీలో ఉండేది. రెండు వర్గాలకు పొసిగేది కాదు. నాడు పరిటాల ఫ్యామిలీని చంద్రబాబు ఒప్పించి జేసి బ్రదర్స్ ను టీడీపీలో చేర్చుకున్నారు. ఇప్పుడు ఈ విషయం అంతా ఎందుకు అంటే .. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది.
పరిటాల శ్రీరామ్ ను ఆలింగనం చేసుకున్న జేసి ప్రభాకర్ రెడ్డి
గతంలో వైరి వర్గంగా ఉన్న జేసి ప్రభాకర రెడ్డి, పరిటాల శ్రీరామ్ ను అప్యాయంగా కౌగిలించుకోవడం ఆయా వర్గాలను సంబ్రమాశ్చర్యానికి గురి చేసింది. లోకేష్ కు స్వాగతం పలికేందుకు జిల్లా సరిహద్దుకు జెసి ప్రభాకర రెడ్డి చేరుకున్నారు. అప్పటికే అక్కడ ఉన్న పరిటాల శ్రీరామ్ ఆయనను అప్యాయంగా పలకరించడంతో శ్రీరామ్ ను జేసి ఆలింగనం చేసుకుని కొద్ది సేపు సరదాగా మాట్లాడుకున్నారు. జేసి కుటుంబం టీడీపీలో చేరిన తరువాత వీరు ఇరువురు కలవడం చాలా అరుదుగా జరిగేది. ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకోవడం, మాట్లాడుకోవడంపై అక్కడ ఉన్న ఇరువర్గాల క్యాడర్ సంతోషం వ్యక్తం చేస్తోంది.