MAA Elections: త్వరలో జరగనున్న తెలుగు నటీ నటుల సంఘం (మా) అధ్యక్ష ఎన్నికల్లో ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ ఎవరికి మద్దతు ఇవ్వనున్నారు అనేది తేలిపోయింది. మా ఎన్నికల బరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, హేమ, సివీఎల్ నర్శింహరావులు నిలుస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మా ఎన్నికల్లో అధ్యక్షుడిగా ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య రసవత్తర పోటీ జరగనున్నదని వార్తలు వస్తుండగా మెగా స్టార్ చిరు వర్గం ప్రకాష్ రాజ్ వైపు నిలిచింది. చిరు నేరుగా ప్రకాష్ రాజ్ కు మద్దతు ఇస్తున్నట్లు తెలియజేయకపోయినా ప్రకాష్ రాజ్ ప్యానల్ లో ఉన్న నాగబాబు ఇప్పటికే సోదరుడు చిరు ఆశీస్సులతో ప్రకాష్ రాజ్ బరిలో నిలుస్తున్నారని చెప్పేశారు.
అయితే మా ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించిన మంచు విష్ణు మా భవన నిర్మాణానికి అయ్యే వ్యయంలో 25 శాతం తాను అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీ బాలయ్యకు బాగా నచ్చినట్లు ఉంది. మా భవనం కోసం మంచు విష్ణు ముందుకు వస్తే అందులో భాగస్వామినవుతానని బాలయ్య పేర్కొన్నారు. అంటే బాలయ్య ఇన్డైరెక్ట్ గా విష్ణుకు మద్దతు ఇస్తున్నట్లు హింట్ ఇచ్చేనని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
బాలయ్య ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై మాట్లాడటం హాట్ టాపిక్ అయ్యింది. సినిమా పరిశ్రమ సమస్యలపై బహిరంగంగా చర్చించకూడదని హితవు పలుకుతూనే తన మనసులోని మాటాలను బయటకు చెప్పేశారు. మా లో లోకల్, నాన్ లోకల్ అనే సమస్య లేదన్నారు. గతంలో మా ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు అంటూ విదేశాలకు వెళ్లారు. విమానాల్లో తిరిగారు, ఆ డబ్బులు ఏమైయ్యాయని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రభుత్వంతో రాసుకు, పూసుకు తిరుగుతున్నారు మరి మా భవనం కోసం ఒక్క ఎకరం భూమి తెచ్చుకోలేకపోయారా అంటూ సెటైర్ వేశారు. ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అన్నారో సినీ వర్గాలతో పాటు ప్రజలు, అభిమానులకు అర్ధం అయ్యే ఉంటుంది కదా. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో బాలయ్య వైఖరి ఏమితో అర్ధం అయ్యింది అంటున్నాయి సినీ వర్గాలు.