Maha Shivaratri 2023: తెలుగు రాష్ట్రాలు శివ నామస్మరణతో మార్మోగుతున్నాయి. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద ఎత్తున శివాలయాలకు పోటెత్తారు. ఉదయం నుండే ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఓం నమః శివాయ, హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తి పారవశ్యంతో మునిగిపోయారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సర్వదర్శనంతో పాటు రూ.50, రూ.200, రూ.500ల టికెట్లతో ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. భక్తులకు మహాలఘు దర్శనాన్ని ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు.
దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచిన సంగారెడ్డి జిల్లా ఝరాసంఘం కేతని సంగమేశ్వర ఆలయంలో పార్వతీ సమేత సంగమేశ్వరుడిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు భారీగా తరలివస్తున్నారు. మహా శివుడి దర్శనం కోసం భక్తులు పోటెత్తడంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. ఆలయ అమృత గుండంలో స్నానాలు ఆచరించిన భక్తులు పార్వతీ సమేత సంగమేశ్వరుడిని దర్శించుకుని పునీతులు అవుతున్నారు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పాతాళగంగ లో భక్తుల పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. భక్తుల రద్దీతో పాతాళ గంగ ప్రాంతం కిటకిటలాడుతోంది. స్వామి, అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఈ రాత్రి 7 గంటలకు స్వామి, అమ్మ వార్లకు నంది వాహన సేవ నిర్వహించిన అనంతరం మల్లికార్జున స్వామికి జగద్గురు పీఠాధిపతి అభిషేకం నిర్వహించనున్నారు. రాత్రి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మల్లికార్జున స్వామి ఆలయానికి పాలాలంకరణ అనంతరం రాత్రి 12 గంటలకు స్వామి, అమ్మవార్ల కు బ్రహ్మోత్సవ కల్యాణం జరపనున్నారు.
ఏపిలో ప్రసిద్ది గాంచిన పల్నాడు జిల్లా కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి ఆలయంలో మహా శివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. కోటప్పకొండ తిరునాళ్లకు రాష్ట్ర నలుమూల నుండి వచ్చే భక్తుల సౌకర్యార్ధం వివిధ ఆర్టీసీ డిపోల నుండి 265 ప్రత్యేక బస్సులను అధికారులు ఏర్పాటు చేశారు. తిరునాళ్ల వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలానే ఎన్టీఆర్ జిల్లా కూడలి సంగమేశ్వరస్వామి వారి ఆలయం, ముక్త్యాల ముక్తేశ్వరస్వామి తదితర ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇలా తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు అన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
చంద్రబాబుపై పలువురు మంత్రులు ఫైర్ ..ఎవరు ఏమన్నారంటే..?