Manchu Mohan Babu: గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి పార్టీ అభ్యర్ధుల విజయానికి ప్రచారం చేసిన ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. టీడీపీ హయాంలో రాజ్యసభ సభ్యుడుగా చేసిన మోహన్ బాబు.. సీఎం వైఎస్ జగన్ కు సమీప బంధువు కావడంతో వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏదైనా నామినేటెడ్ పోస్టు దక్కుతుందని అందరూ భావించారు. టీటీడీ చైర్మన్, రాజ్యసభ, ఫిలిమ్ డవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ ఇలా ఏదో ఒక నామినేటెడ్ పదవి మోహన్ బాబుకు లభిస్తుందని ఊహాగానాలు వచ్చాయి. అయితే ఈ ఊహాగానాలను మోహన్ బాబు కొట్టిపారేశారు. ‘నేను ఏ పదవి ఆశించలేదు, సీఎం జగన్ ఇస్తాననీ చెప్పలేదు’ అని గతంలోనే పేర్కొన్నారు మోహన్ బాబు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Manchu Mohan Babu: అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి దూరంగా
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మోహన్ బాబు ఏనాడూ సీఎం వైఎస్ జగన్ ను కలుసుకోలేదు. ఆయన కుమారుడు మంచు విష్ణు మాత్రం రెండు మూడు సార్లు తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లి కలిశారు. వైసీపీకి దూరంగా ఉండటంతో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు కుమారుడు, కుమార్తెతో కలిసి మోహన్ బాబు ఢిల్లీకి వెళ్లి ఆయనకు కలిసి రావడంతో బీజేపీలో చేరతారేమో అన్న ప్రచారం కూడా జరిగింది. అయితే మోహన్ బాబు అధికారికంగా కాషాయం కండువా కప్పుకోలేదు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో సీఎం జగన్ పరిపాలనపై కీలక వ్యాఖ్యలు చేశారు మోహన్ బాబు. సీఎం జగన్ ను కొందరు అధికారులు తప్పుదోవపట్టిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు మోహన్ బాబు తాను ఏ పార్టీ వ్యక్తిని అనే దానిపై ఒక క్లారిటీ ఇచ్చారు.
‘నేను బీజేపీ మనిషి’ని
2019 లో తిరుపతిలో తన శ్రీవిద్యానికేతన్ సంస్థ విద్యార్ధులతో కలిసి ధర్నా నిర్వహించిన సందర్భంలో నమోదు అయిన కేసులో కోర్టు విచారణ కోసం మోహన్ బాబు మంగళవారం తిరుపతికి వచ్చారు. ఆనాడు ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారనే అభియోగాలతో కేసు నమోదు అయ్యింది. మోహన్ బాబు, కుమారులు విష్ణు, మనోజ్ లతో పాటు శ్రీవిద్యానికేతన్ ఏఓ తులసినాయుడు, పీఆర్ఓ సతీష్ లపై కూడా కేసు నమోదు అయ్యింది. ఈ కేసు నిమిత్తం తిరుపతికి వచ్చిన మోహన్ బాబు మీడియా వద్ద సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీ మనిషిని, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో తాను కూడా ఒకడిని అంటూ కామెంట్స్ చేశారు మోహన్ బాబు. తాను బీజేపీ మనిషిని అని చెప్పడంతో వైసీపీకి దూరమైనట్లు పరోక్షంగా చెప్పినట్లు అయ్యింది. తాజాగా మోహన్ బాబు చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. ఇక కేసు విషయంపై మాట్లాడుతూ తాను రియల్ హీరోననీ, విద్యార్ధుల కోసం పోరాడితే అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు.