Manchu Vishnu: ఏపిలో కొద్ది నెలలుగా సినిమా ఇండస్ట్రీ, ఏపి ప్రభుత్వానికి మధ్య సినిమా టికెట్ ల వ్యవహారం హాట్ హాట్ గా నడిచింది. టికెట్ ధరలను తగ్గిస్తూ ఏపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సినీ పరిశ్రమ, ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం జరిగింది. టికెట్ ధరల తగ్గింపుపై పలువురు సినీ ప్రముఖులు చేసిన కామెంట్స్ ప్రభుత్వానికి కోపం తెప్పించాయి. ఇటు మంత్రులు, వైసీపీ నేతలు సినీ వర్గాలను తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ తరుణంలోనే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఏపి మంత్రి పేర్ని నాని మధ్య ట్వీట్ వార్ జరగడం, ఆ తరువాత మంత్రి పేర్ని నానితో వర్మ లంచ్ మీటింగ్ జరగడం తెలిసిందే. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో సినీ ప్రముఖులు మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, ఆర్ నారాయణమూర్తి, ఆలీ, పోసాని కృష్ణమురళి తదితర ప్రముఖులు ఏపి సీఎం వైఎస్ జగన్ తో భేటీ అయి సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై చర్చించారు. ఈ భేటీ అనంతరం సీఎం జగన్ తాము తెలిపిన సమస్యలపై సానుకూలంగా స్పందించారనీ, త్వరలో సమస్యల పరిష్కారం అవుతుందని చిరంజీవితో సహా సినీ ప్రముఖులు మీడియాకు వెల్లడించారు.
Manchu Vishnu: నాడు ఆహ్వానం లేదు
అయితే ఈ సమావేశానికి ముందు చిరంజీవి ఒక్కరే జగన్ తో భేటీ అవ్వడం పట్ల మా అధ్యక్షుడు మంచు విష్ణు సంచలన కామెంట్స్ చేశారు. అది వ్యక్తిగత మీటింగ్ గా అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పుడు మంచు విష్ణు సీఎం జగన్ తో భేటీ అయ్యేందుకు తాడేపల్లికి చేరుకున్నారు. ప్రస్తుత తరుణంలో సీఎం జగన్ తో మంచు విష్ణు భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇటీవల జరిగిన సినీ ప్రముఖుల సమావేశానికి మా అధ్యక్షుడుగా ఉన్న మంచు విష్ణుకు గానీ, సీనియర్ నటుడు మోహన్ బాబు గానీ ఆహ్వానం లేదు. ఈ విషయాన్ని మోహన్ బాబే స్వయంగా ఇటీవల మంత్రి పేర్ని నానికి తెలిపారు. అహ్వానించి ఉంటే తాను వచ్చే వాడినని మోహన్ బాబు పేర్కొన్నారు. మా అధ్యక్షుడుగా గెలిచిన తరువాత మొదటి సారి మంచు విష్ణు సీఎం జగన్ తో భేటీ అవుతున్నారు. బంధుత్వ రీత్యా మర్యాదపూర్వకంగా సీఎం జగన్ ను మంచు విష్ణు కలుస్తున్నారా లేక మా అధ్యక్షుడి హోదాలో సినీ పరిశ్రమ సమస్యలపై మాట్లాడేందుకు కలుస్తున్నారా అనేది ఇంకా తెలియరాలేదు. సమావేశం అనంతరం మంచు విష్ణు ఏమని ట్వీట్ చేస్తారు అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నేడు నేరుగా లోపలికి అనుమతి
సీఎం జగన్ నివాసానికి చేరుకున్న మంచు విష్ణు వాహనానికి నేరుగా లోపలికి అనుమతి ఇచ్చారు. జగన్ కుటుంబంతో మంచు ఫ్యామిలీకి బంధుత్వం ఉండటంతో గతంలోనూ పలు మార్లు విష్ణు జగన్ ను నేరుగా ఇంట్లోకి వెళ్లి కలిశారు. అయితే ఇటీవల చిరంజీవి బృందం వచ్చిన సమయంలో వీరి వాహనాలను గేటు దగ్గరే నిలిపివేయడంతో వారు అక్కడ నుండి లోపలకు నడుచుకుంటూ వెళ్లారు. ఆనాడే చిరంజీవి బృందానికి సరైన గౌరవం లభించలేదని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. రామ్ గోపాల్ వర్మ, తమ్మారెడ్డి భరద్వాజ్ లాంటి వాళ్లు నాటి బేటీపై కామెంట్స్ చేశారు.