మాండూస్ తుపాను రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో తీవ్ర ప్రభావాన్ని చూపింది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కుండపోతగా, అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం, వైఎస్ఆర్ జిల్లాల్లో భారీగా వర్షం కురిసింది. మిగిలిన జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు పడ్డాయి. కుండపోత, భారీ వర్షాల కారణంగా భారీ వృక్షాలు నేలకొరిగాయి, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులపైకి నీళ్లు చేరుకోవడంతో చాలా చోట్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. స్తంబాలు నేల కూలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆయా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. శ్రీకాళహస్తి – తడ మార్గంలో సున్నపు కాల్వపై బస్సు చిక్కుకోవడంతో పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ప్రయాణీకులను రక్షించారు. వాతావరణం అనుకూలించకపోవడంతో హైదరాబాద్ – రేణిగుంట ఇండిగో విమానం రద్దు అయ్యింది.
సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు
ప్రకాశం జిల్లా చీరాల వాడరేపుకు చెందిన ఏడుగురు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లి సముద్రంలో చిక్కుకున్నారు. సింగరాయకొండ మండలం ఉళ్లపాలెం తీరానికి రెండు కిలో మీటర్ల దూరంలో వీరి పడవ ఉండటాన్ని గమనించిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వారిని రక్షించానికి ప్రయత్నాలు చేశారు. వీరు ఆరు రోజుల క్రితమే వేటకు వెళ్లగా తుఫాను ప్రభావంతో సిగ్నళ్లు లేక దారి తెలియక చిక్కుకున్నారు. సిగ్నళ్లు అందిన తర్వాత కుటుంబ సభ్యులకు, మెరైన్ పోలీసులకు సమాచారం అందించడంతో వారి జాడ తెలిసింది. ఏడుగురు మత్స్యకారులు కొత్తపట్నం వద్ద సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.
తుపాను ప్రభావిత జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. కాగా శనివారం సాయంత్రానికి వాయుగుండంగా బలహీన పడిన తీవ్ర వాయుగుండం క్రమేపీ బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాను తీరం దాటిన తర్వాత దాని ప్రభావంతో దాని ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అది, సోమవారాల్లో కూడా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. చలి గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పింది.