Mansas Trust: విజయనగరం జిల్లా మాన్సాస్ , సింహాచలం ఆలయాల ట్రస్ట్ చైర్ పర్సన్గా సంచయిత గజపతిరాజును నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 72ను హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. చైర్మన్ గా అశోక్ గజపతిరాజును పునర్నియమించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని కలిసి పలు విషయాలపై చర్చించారు. మాన్సాస్ ట్రస్ట్ కు సంబంధించిన పలు అంశాలను వివరించారు. తదుపరి హైకోర్టు తీర్పుపై స్పందించారు. మాన్సాస్ ట్రస్ట్ వివాదంలో హైకోర్టు తీర్పుపై అప్పీల్ కు వెళతామని తెలిపారు. హైకోర్టు తీర్పునకు సంబంధించి పూర్తి ఉత్తర్వులు అందలేదనీ, ఆ తీర్పును పరిశీలించి ముందుకు వెళతామన్నారు. అప్పీల్ లో తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు మంత్రి వెల్లంపల్లి.
వివాదం ఏమిటంటే…
పూసలపాటి వంశీయులైన దివంగత పివిజీ రాజు 1958లో మహారాజ అలక్ నారాయణ సొసైటి ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ (మాన్సాస్) ట్రస్ట్ ను స్థాపించారు. ఆయన తదనంతరం ట్రస్ట్ బైలా ప్రకారం పివిజీ రాజు పెద్ద కుమారుడు ఆనంద గజపతిరాజు ట్రస్ట్ చైర్మన్ గా కొనసాగారు. 2016 లో ఆనంద గజపతిరాజు మరణానంతరం మాన్సాస్ చైర్మన్ పదవిని పీవీజీ రాజు రెండవ కుమారుడు అశోక్ గజపతిరాజు చేపట్టారు. అయితే గత ఏడాది మార్చి నెలలో జగన్మోహనరెడ్డి సర్కార్ జివో 72 ద్వారా అశోక్ గజపతిరాజును తొలగించి ఆయన స్థానంలో దివంగత ఆనంద గజపతిరాజు మొదటి భార్య కుమార్తె సంచయిత గజపతిరాజును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జివోను అశోక్ గజపతిరాజు హైకోర్టులో సవాల్ చేయగా ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది.
కాగా హైకోర్టు తీర్పుపై కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం చట్టాలను, రాజ్యాంగాన్ని గౌరవించాలని సూచించారు. ట్రస్ట్ చైర్మన్ గా తాను అక్రమాలకు పాల్పడినట్లు తప్పుడు ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. ఉద్యోగులను, సిబ్బందిని చాలా ఇబ్బందికి గురి చేశారనీ, తనపై పగతోనే మాన్సాస్ కార్యాలయాన్ని తరలించారని ఆవేదన వ్యక్తం చేశారు.