Mansas Trust: ఏపి ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కొనసాగింపునకు సంబంధించి సింగిల్ జడ్జి తీర్పును హైకోర్టు సమర్థించింది. అశోక్ గజపతిరాజును పునర్ నియమిస్తూ సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం, సంచయిత గజపతిరాజు, ఊర్మిలగజపతిరాజు లు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్ లో వారు కోరారు. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని హైకోర్టు డివిజన్ బెంచ్ బుధవారం ఈ పిటిషన్ లను విచారించింది. అనుబంధ పిటిషన్ లను కొట్టివేసిన హైకోర్టు విచారణను వాయిదా వేసింది.
గతంలో ప్రభుత్వం అశోక్ గజపతిరాజును తొలగించి మాన్సాస్, సింహాచలం దేవస్థానం చైర్ పర్సన్ గా ఆయన అన్న కుమార్తె సంచయిత గజపతిరాజును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో పై అశోక్ గజపతిరాజు హైకోర్టు ను ఆశ్రయించగా సంచయిత గజపతిరాజు నియామక జీవోను సింగిల్ బెంచ్ కోర్టు కొట్టేసింది. అశోక్ గజపతిరాజును పునర్నియమించాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో అశోక్ గజపతిరాజు తిరిగి చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి కొనసాగుతున్నారు.