తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పరిష్కారం కాని విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ ఈ నెల 27వ తేదీన కీలక సమావేశం నిర్వహించనున్నది. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఏపి, తెలంగాణ ప్రభుత్వాలకు హోంశాఖ నుండి లేఖలు అందాయి. రాష్ట్రాల విభజన జరిగి ఎనిమిదేళ్లు గడుస్తున్నా విభజన చట్టంలో పొందుపర్చిన అనేక అంశాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. విభజన చట్టంలో పేర్కొన్న సమస్యలను పరిష్కరించాలని ఏపి సర్కార్ పదేపదే కేంద్రాన్ని కోరుతూనే ఉంది. ఇటీవల జరిగిన దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశంలో చర్చించిన 26 అంశాల్లో తొమ్మిది ఏపికి చెందిన విభజన అంశాలే ఉన్నాయి. ఈ సందర్భంలో రెండు తెలుగు రాష్ట్రాలూ పరస్పరం పరిష్కరించుకోవాల్సిన అంశాలను త్వరగా తేల్చుకోవాలని కేంద్రం సూచించింది. అయితే ఇంతకు మాదిరిగా తెలుగు రాష్ట్రాల మధ్య అంత సుహృద్భావ వాతావరణం లేదు. ఈ నేపథ్యంలో కేంద్రమే ఇరు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి చొరవ చూపాల్సిన అవసరం ఉంది. ఈ తరుణంలో కేంద్రం ఒక అడుగు ముందుకు వేసింది. విభజన సమస్యల పరిష్కారానికి గానూ రెండు రాష్ట్ర్లాల ప్రధాన కార్యదర్శులు, సంబంధింత శాఖల అధికారులతో ఈ నెల 27న కేంద్ర హోంశాఖ సమావేశం ఏర్పాటు చేసింది.
ఈ సమావేశంలో విభజన చట్టం ప్రకారం రాజధానికి కేంద్ర సహకారంపై చర్చించనున్నారు. విభజన చట్టం షెడ్యుల్ 9,10 లోని ఆస్తుల పంపకాలపైనా భేటీలో చర్చించనున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఆర్ధికపరమైన అంశాలు చర్చకు రానున్నాయి. సమావేశంలో చర్చించనున్న అంశాలను కేంద్ర హోంశాఖ పొందుపర్చింది. అయితే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటు తమ విధానమని స్పష్టం చేస్తోంది. ఆ మేరకు వైసీపీ పెద్దలు, మంత్రులు తమ ప్రభుత్వం, పార్టీ విధానం మూడు రాజధానుల ఏర్పాటు అని స్పష్టం చేస్తున్నారు. అయితే కేంద్ర హోంశాఖ జారీ చేసిన అజెండాలో మూడు రాజధానుల ప్రస్తావన లేదు. కొత్త రాజధానికి నిధులు అని మాత్రం పేర్కొంది. కొత్త రాజధాని ఏర్పాటునకు కేంద్ర సహకారం, కేంద్ర విద్యాసంస్థల స్థాపన, రాజధాని నుండి ర్యాపిడ్ రైల్ అనుసంధానం తదితర అంశాలను కేంద్ర హోంశాఖ అజెండాలో పొందుపర్చింది.
కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో జరిగే ఈ సమావేశానికి హజరు కావాలాలని ఏపి, తెలంగాణ సీఎస్ లతో పాటు రైల్వే బోర్డు చైర్మన్ లు, వివిధ శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ఆర్ధిక శాఖతో పాటు విద్య, రైల్వే, పెట్రోలియం శాఖలతో పాటు దాదాపు తొమ్మిది శాఖల అధికారులను ఈ సమావేశానికి ఆహ్వానించారు. షెడ్యుల్ 9 లో ఉన్న ప్రభుత్వ కంపెనీలు, కార్పోరేషన్లు, షెడ్యుల్ 10లో ఉన్న రాష్ట్ర సంస్థల విభజన, విభజన చట్టంలో పేర్కొనని సంస్థల పంపిణీ, ఏపి ఫైనాన్స్ కార్పోరేషన్, సింగరేణి కాలరీస్, ఏపి హెవీ మిషనరీ ఇంజనీరింగ్, నగదు, బ్యాంకు బ్యాలెన్సులు, విదేశీ సాయంతో చేపట్టిన ప్రాజెక్టులపై తీసుకున్న ఆప్పుల విభజన, తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల నుండి ఏపి విద్యుత్ పంపిణీ సంస్థలకు రావాల్సిన నిధులు తదితర అంశాలపై భేటీలో చర్చించనున్నట్లు కేంద్ర హోంశాఖ పేర్కొంది.
AP TS Bifurcation Issues: తాంబూలాలు ఇచ్చాం .. తన్నుకు చావండి..!!