Minister Buggana Rajendranath reddy: సాధారణంగా విమానాశ్రయాలకు వీవీఐపీలు వచ్చిన సందర్భంలో పలువురు నేతలకు భద్రతా సిబ్బంది నుండి పరాభవాలు ఎదురవుతుంటాయి. వీవీఐపీలు వచ్చిన సందర్భంలో జిల్లాస్థాయి అధికారులు ప్రోటోకాల్ ప్రకారం ఎవరెవరిని అనుమతించాలి అనే దానిపై పేర్లు, వారి హోదాలతో వివరాలను విమానాశ్రయ అధికారులకు ముందుగా ఇస్తుంటారు. ప్రోటోకాల్ లిస్ట్ లో ఉన్న అధికారులు, నేతలను వీఐపీ గేటు గుండా వెళ్లేందుకు భద్రతా సిబ్బంది అనుమతి ఇస్తారు. అయితే ఇక్కడ ఎలా పొరబాటు జరిగిందో తెలియదు కానీ రేణిగుంట విమానాశ్రయంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డికి కేంద్ర భద్రతా సిబ్బంది నుండి ఊహించని పరాభవం ఎదురైంది.
కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ కు స్వాగతం చెప్పేందుకు గానూ మంత్రి బుగ్గన వీఐపీ గేటు నుండి వెళుతుండగా కేంద్ర భద్రతా సిబ్బంది అడ్డుకున్నట్లు తెలిసింది. ఆయనను పక్కకు తోసివేయడంతో మంత్రి తీవ్ర అసహనానికి గురైయ్యారు. ఈ సందర్భంలో కేంద్ర భద్రతా సిబ్బందితో మంత్రి బుగ్గన వాగ్వివాదానికి దిగినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం కారణంగా ఆయన కేంద్ర మంత్రి గోయల్ ను కలవలేకపోయారు. ఈ విషయంపై మంత్రి బుగ్గన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో విమానాశ్రయ సిబ్బంది కల్పించుకుని సర్దిచెప్పి పంపించారు.
విషయం ఏమిటంటే…రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ రెండు రోజుల పర్యటన నిమిత్తం చిత్తూరు జిల్లాకు వచ్చారు. ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్ర ప్రబుత్వం తరపున స్వాగతం పలికేందుకు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెళ్లారు. ఆయితే వీఐపీ గేటు వద్ద కేంద్ర భద్రతా సిబ్బంది ఆయనను లోపలికి వెళ్లడానికి అనుమతి ఇవ్వలేదు. తాను మంత్రిని అని చెప్పి ప్రవేశించే ప్రయత్నం చేయగా కేంద్ర భద్రతా సిబ్బంది ఆయనను బలంగా వెనక్కి నెట్టివేయడంతో కిందపడే పరిస్థితి తలెత్తింది. దీంతో కేంద్ర మంత్రిని బుగ్గన కలవలేకపోయారు. ఈ సందర్భంలో తనను అడ్డుకున్న భద్రతా సిబ్బంది వివరాలు ఇవ్వాలని విమానాశ్రయ అధికారులను బుగ్గన కోరగా అధికారులు ఆయనకు సర్ధిచెప్పి ప్రయత్నం చేశారు. అయితే బుగ్గన కు జరిగిన అవమానంపై మంత్రి కార్యాలయ అధికారులు సీఎంఒకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.