తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ మధ్య పొరాపొచ్చాలు వచ్చాయని గత ఏడాది ఓ రేంజ్లో వైరల్ అయిపోయిన సంగతి తెలిసిందే. అనంతరం అంతా సద్దుమణిగిపోయింది. ఇలాంటి సమయంలో తాజాగా తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అదికూడా కీలకమైన కరోనా మహమ్మారి విషయంలో.
కరోనా కలకలం సమయంలోనే….
ఈ నెల 16న దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ వేస్తమని కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో సైతం అదే రోజు ఉదయం 9 గంటల నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్(డీహెచ్) డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. తొలి రోజు రాష్ర్ట వ్యాప్తంగా 45 ప్రైవేట్, 94 ప్రభుత్వ సెంటర్లలో వ్యాక్సినేషన్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. వీటిలో ఎక్కువగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉండనున్నాయి. అయితే, ఈ సమయంలోనే మంత్రి ఈటల రాజేందర్ కీలక ప్రకటన చేశారు.
నేనే అలా చేస్తానంటున్న ఈటల
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ సరఫరా ప్రారంభం కానున్న తరుణంలో కరోనా తొలి వ్యాక్సిన్ ను తానే వేసుకుంటానని మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. కరోనా నోడల్ సెంటర్గా ఉన్న గాంధీ హాస్పిటల్ లేదా హైదరాబాద్లోని మరేదైనా సెంటర్లో ఆయన వ్యాక్సిన్ వేసుకునే అవకాశం ఉందని సమాచారం . ఇదిలాఉండగా, తాజాగా ఓ సంస్థకు చెందిన కోవిడ్ వ్యాక్సిన్ వికటించిందని ఓ వ్యక్తి మరణించారని ప్రచారం జరుగుతున్న సమయంలో తెలంగాణ ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్ ఈ కీలక నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని పలువురు పేర్కొంటున్నారు.
తెలంగాణలో వ్యాక్సిన్ పంపిణీ ఇలా….
తెలంగాణలో మొదటి రోజు ఒక్కో జిల్లాలో 2 లేదా 3 సెంటర్లలో మాత్రమే వ్యాక్సినేషన్ జరగనుంది. ఒక్కో సెంటర్లో వంద మంది చొప్పున 13,900 మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. 18 నుంచి సుమారు 1,200 సెంటర్లలో వ్యాక్సినేషన్ కొనసాగిస్తామని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్(డీహెచ్) శ్రీనివాసరావు వివరించారు. ఇప్పటివరకు 2.9 లక్షల మంది హెల్త్ కేర్ వర్కర్ల వివరాలను కోవిన్ సాఫ్ట్వేర్లో రిజిస్టర్ చేశారు. వీరిలో సుమారు 1.35 లక్షల మంది ప్రభుత్వ దవాఖాన్ల డాక్టర్లు, సిబ్బంది.. 1.55 లక్షల మంది ప్రైవేట్ డాక్టర్లు, సిబ్బంది ఉన్నారు. వ్యాక్సినేషన్ తేదీ నాటికి ఈ సంఖ్య 3 లక్షల వరకు పెరగొచ్చని శ్రీనివాసరావు తెలిపారు. వారం రోజుల్లోనే వీళ్లందరికీ ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఆ తర్వాత 28వ రోజు నుంచి సెకండ్ డోస్ వ్యాక్సిన్ ఇస్తారు. ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్రంట్ లైన్ వర్కర్లైన పోలీసులు, మున్సిపల్ సిబ్బందికి వ్యాక్సిన్ వేయనున్నారు.