Vangaveeti Radha Krishna: మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ రాబోయే ఎన్నికల్లో గుడివాడలో మంత్రి కొడాలి నానిపై టీడీపీ తరపున పోటీ చేయాలని భావిస్తున్నారనీ, అందుకే గుడివాడ నియోజకవర్గ పరిధిలోని పలువురు ముఖ్య కాపు నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా ఇటీవల వార్తలు వచ్చాయి. గుడివాడలో కొడాలి నానిని దెబ్బతీసేందుకు టీటీడీ వ్యూహాత్మకంగా వంగవీటి రాధాను ఆయనపై పోటీకి దింపుతోందని ప్రచారం జరుగుతోంది. గుడివాడ నియోజకవర్గంలో కాపు, యాదవ సామాజిక వర్గాల ఓటింగ్ అభ్యర్థుల విజయవావకాశాలను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున రాధ అక్కడ నుండి పోటీ చేయడం వల్ల మంచి ఫలితం వస్తుందని ఊహగానాలు చేస్తున్నారు. వాస్తవానికి వంగవీటి రాధా, కోడాలి నానికి మధ్య మంచి స్నేహసంబంధాలు ఉన్నాయి. గతంలో గుడివాడలో ప్రతి కార్యక్రమంలో నానితో కలిసి రాధా పాల్గొంటూ ఉండేవారు. అయితే ఇటీవల కాలంలో నాని లేకుండానే రాధా గుడివాడ ప్రాంత నాయకులతో రహస్య సమావేశాలను నిర్వహిస్తున్నారని ప్రచారం జరగడంతో గుడివాడలో పోటీకి రాధా సిద్ధం అవుతున్నారని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది.
అయితే ఈ ఉహాగానాలకు భిన్నంగా రీసెంట్ గా మరో సంఘటన చోటుచేసుకుంది. దీంతో వంగవీటి రాధ వైసీపీలోకి రీఎంట్రీ అవ్వనున్నారని వార్తలు షికారు చేస్తున్నాయి. తాజాగా గుడివాడలో ఆదివారం చోటుచేసుకున్న ఓ కీలక పరిణామం ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. గుడివాడ వైసీపీ నాయకుడు పాలేటి సుబ్రమణ్యం మనుమడి పుట్టిన రోజు వేడుకల్లో మంత్రి కొడాలి నానితో పాటు వంగవీటి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఇద్దరూ పరస్పరం పలకరించుకున్నారు. మంత్రి కొడాలి నానికి చెందిన కే కన్వెన్షన్ అతిధి గృహంలో దాదాపు రెండు గంటల పాటు వీరు సమావేశమైయ్యారు. ఈ సమావేశంలో కొడాలి నాని కీలక ప్రతిపాదనను రాధాకృష్ణ వద్ద పెట్టి నట్లు వార్తలు వస్తున్నాయి. రాధా మళ్లీ వైసీపీకి వస్తే ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో పాటు రాజకీయ భవిష్యత్ పైనా సీఎం జగన్ ను ఒప్పిస్తానని నాని ఆఫర్ చేస్తూ ఈ ప్రతిపాదనను అంగీకరించాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదనపై కొంత సానుకూలతను రాధా వ్యక్తం చేశారనీ అయితే ఈ చర్చల్లో రాధా కృష్ణ ఓ కీలక కండీషన్ పెట్టారని అంటున్నారు. అది ఏమిటంటే తనకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పోటీకి స్పష్టమైన హామీ ఇస్తే నిర్ణయం తీసుకుంటానని రాధాకృష్ణ చెప్పారట. రాధ డిమాండ్ అంగీకరిస్తే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కు సీఎం ఏ రకమైన హామీ ఇస్తారనేది ఆసక్తికరమైన అంశంగా మారింది.
గత ఎన్నికలకు ముందు వంగవీటి రాధాకృష్ణ వైేసీపీని వీడి టీడీపీలో చేరారు. అయితే టీడీపీలో ఆయనను ఎక్కడ నుండి పోటీ చేయడానికి అవకాశం ఇవ్వలేదు. ప్రచారానికే రాధాను పార్టీ ఉపయోగించుకుంది. రాధా టీడీపీలో చేరిన తరువాత అప్పటి వరకూ ఆ పార్టీలో ఉండి గుడివాడ నుండి పోటీ చేసి ఓడిపోయిన దేవినేని అవినాష్ ఆ పార్టీని వీడి వైసీపీలో చేరారు. ఇప్పుడు రాధా వైసీపీలో రీఎంట్రీ ఇస్తే అవినాష్ వైసీపీలో కొనసాగుతారా లేదా అనేది మరో చర్చ జరగుతోంది. రాధా వైసీపీలో చేరడం ఖాయమన్న భావనతో ఆ పార్టీ వారు ఉన్నారు. ప్రస్తుతం రాధా పార్టీలో చేరిక వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఏది ఏమైనా కొద్ది రోజుల్లో ఈ విషయాలపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.