Kuppam: రాబోయే ఎన్నికల్లో టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu)ను ఆయన సొంత నియోజకవర్గం కుప్పం లో ఓడించాలని వైసీపీ (YCP)వ్యూహంతో ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు 175 వైసీపీ కైవశం చేసుకోవాలన్న లక్ష్యంతో పని చేయాలని ఇప్పటికే వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ (YS Jagan)పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో కుప్పం మున్సిపాలిటీ (Kuppam Municipality) ని వైసీపీ కైవశం చేసుకోవడంతో ఆ పార్టీ దూకుడు పెంచింది. కుప్పం చంద్రబాబును ఓడిస్తామంటూ ఆ పార్టీ నేతలు ఇప్పటి నుండే చెబుతున్నారు. ఈ క్రమంలో కుప్పంలో చంద్రబాబు మీద పోటీగా చిత్తూరు జిల్లాకే చెందిన తమిళ హీరో విశాల్ (Hero Vishal)ను రంగంలోకి వైసీపీ దింపనున్నదంటూ ఇటీవల ప్రచారం జరుగుతోంది.
Kuppam: కుప్పం వైసీపి అభ్యర్ధి ఎమ్మెల్సీ భరత్
విశాల్ తండ్రి కృష్ణారెడ్డికి కుప్పం నియోజకవర్గంతో సన్నిహిత సంబంధాలు ఉన్నందున ఆయన విశాల్ ను వైసీపీ రంగంలోకి దించే అవకాశాలు ఉన్నట్లుగా సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కుప్పం వైసీపీ ఇన్ చార్జిగా ఉన్న కె భరత్ కు ఎమ్మెల్సీ ఇచ్చినందు వల్ల విశాల్ పేరును వైసీపీ పరిశీలిస్తోందనీ, విశాల్ కు కూడా రాజకీయాల పట్ల ఆసక్తి ఉండటంతో ఇది నిజమేమో అని చాలా మంది అనుకుంటున్నారు. అయితే దీనిపై వైసీపీ నేత, సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. కుప్పంలో చంద్రబాబుపై పోటీ చేసేది, ఆయనను ఓడించేది ప్రస్తుత ఎమ్మెల్సీ గా ఉన్న భరత్ యేనని స్పష్టం చేశారు. పెద్దిరెడ్డి ఇచ్చిన క్లారిటీతో విశాల్ పోటీ అనేది పుకారే అని తేలిపోయింది.
ప్రస్తుతం కుప్పం నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జిగా ఎమ్మెల్సీ కె భరత్ వ్యవహరిస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చురుగ్గా నిర్వహిస్తున్నారు. భరత్ తండ్రి దివంగత చంద్రమౌళి గతంలో రెండు సార్లు కుప్పం నుండి పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లోనూ చంద్రబాబుపై చంద్రమౌళి పోటీ చేసి ఓడిపోయారు. ఆనంతరం ఆయన మృతి చెందడంతో ఆయన వారసుడుగా భరత్ రాజకీయాల్లోకి వచ్చారు. ఈ నియోజకవర్గంలో చంద్రబాబును ఓడించాలన్నలక్ష్యంతో కె భరత్ కు వైసీపీ ఎమ్మెల్సీ ఇచ్చి ప్రోత్సహిస్తొంది. చంద్రబాబును ఓడించే బాధ్యతను తీసుకున్న మంత్రి పెద్దిరెడ్డి .. కుప్పంలో భరత్ కు సూచనలు సలహాలు అందిస్తూ రాజకీయం చేస్తున్నారు.