Peddireddy : రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ప్రారంభానికి ముందు వరకూ ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నంత కాలం ఎన్నికలు జరగడానికి వీలులేదని పట్టుబట్టిన వైసీపీ వర్గాలు ఇప్పుడు పూర్తిగా మాట మార్చేశాయి. ఎన్నికల ముందు వరకూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ టీడీపీ అధినేత చంద్రబాబు జేబులో మనిషి, ఆయన చెప్పినట్లు ఆడుతూ ఉంటాడు అని విమర్శించిన వైసీపీ నేతలు, మంత్రులు ఇప్పుడు ఆయనకు సహకరిస్తున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో నిర్వహించిన పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వ యంత్రాంగం సహకరించడంతో ప్రశాంతంగా పూర్తి అయ్యాయి. అధికార వైసీపీ మద్దతుదారులు 70 నుండి 80 శాతం స్థానాల్లో విజయం సాధించారు. ఆ వెంటనే పురపాలక ఎన్నికలు పూర్తి అయ్యాయి. ఈ ఎన్నికల్లో రెండు మున్సిపాలిటీలు మినహా మిగిలిన అన్ని మున్సిపాలిటీలు, 11 నగర పాలక సంస్థలు వైసీపీ కైవశం చేసుకుంది.
ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంటే ఎన్నికల ముందు వరకూ ఎస్ఈసీ నిమ్మగడ్డకు కొమ్ముకాసిన టీడీపీ వర్గీయులు ఎన్నికల నేపథ్యంలో ఆయనపై విమర్శలు చేయడం ప్రారంభించారు. అప్పటి వరకూ నిమ్మగడ్డ ను విమర్శించిన వైసీపీ శ్రేణులు మాత్రం నిమ్మగడ్డపై అభాండాలు వేయడం మానేశారు. ఇప్పుడు తాజాగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా పూర్తి చేసి వెళ్లాలని కోరుతున్నారు. జడ్పీటీసీ, ఎంపిటీసీల ఏకగ్రీవాలపై హైకోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు అడ్డంకి తొలగిపోయింది.
ఈ నేపథ్యంలో సాక్షత్తు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను పూర్తి చేయాలని ఎస్ఈసీని కోరారు. ఈ నెలాఖరుకు ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ రిటైర్ అవుతారు. ఈ లోపుగానే ఎన్నికలు నిర్వహించి నిమ్మగడ్డ పదవీ విరమణ చేయాలని మంత్రి పెద్దిరెడ్డి విజ్ఞప్తి చేస్తున్నారు. స్థానిక ఎన్నికల ప్రక్రియ ముగిసేందుకు కేవలం ఆరు రోజుల సమయం సరిపోతుందని అన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలంటే స్థానిక ఎన్నికలు పూర్తి కావాల్సి ఉందన్నారు. దేశ వ్యాప్తంగా యుద్ధప్రాతిపదికన వ్యాక్సినేషన్ జరుగుతుంటే ఏపిలో ఎన్నికల వల్ల ఆలస్యం అవుతోందన్నారు. పరిషత్ ఎన్నికలు ముందుగా నిర్వహించి ఆ తర్వాత పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా వైసీపీని దెబ్బతీయాలన్న ఆలోచనతో ఇష్టానుసారంగా ఎన్నికలు నిర్వహించారని ఆరోపించారు.