Perni Nani: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపి మంత్రి పేర్ని నాని మరో సారి విమర్శల వర్షం కురిపించారు. బుధవారం తెలుగు సినీ నిర్మాతలు మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యారు. సినీ రంగ సమస్యలపై చర్చించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఆన్ లైన్ టికేటింగ్ కొత్తగా ప్రభుత్వం ప్రవేశపెట్టింది కాదని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమ ఆన్ లైన్ టికెటింగ్ కు అనుకూలంగా ఉందని తెలిపారు. సినిమా టికెట్ లపై నిర్ధిష్ట విధానం అవసరమని గుర్తు చేశారు, ఇప్పటికే ఆన్ లైన్ విధానం కొనసాగుతోందని చెప్పిన మంత్రి పేర్ని నాని..సినీ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై చర్చించేందుకు నిర్మాతలు వచ్చారన్నారు. పరిశ్రమ అంతా ఐక్యంగానే ఉందని పేర్కొన్నారన్నారు. ప్రస్తుతం సినీ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారని చెప్పారు. సినీ నిర్మాణ వ్యయం పెరిగినందున టికెట్ ధర తక్కువ ఉంటే ఇబ్బందులు పడతామని నిర్మాతలు తెలిపారన్నారు. దీనిపై ప్రభుత్వం చొరవ చూపాలని కోరారన్నారు.
Perni Nani: థియేటర్ లలో 50 శాతం ఆక్యుపెన్సీని వంద శాతంకు పెంచాలి
కరోనా కారణంగా సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోయిందనీ, ఇప్పటి వరకూ థియేటర్ లలో ఉన్న 50 శాతం ఆక్యుపెన్సీని వంద శాతం పెంచాలని నిర్మాతలు కోరారన్నారు. వారి సమస్యలపై సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి సానుకూలంగా స్పందిస్తారనుకుంటున్న సమయంలో ఒక సినీనటుడు వల్ల దురదృష్టకర పరిణామాలు తలెత్తాయని అన్నారు. ఈ నేపథ్యంలో పవన్ అభిప్రాయాలకు తాము అనుకూలంగా లేమనీ, పవన్ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని నిర్మాతలు స్పష్టం చేశారని మంత్రి నాని అన్నారు. అదే విధంగా చిరంజీవి కూడా తనతో మాట్లాడారనీ, రిపబ్లిక్ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ లో జరిగిన పరిణామాలతో పరిశ్రమకు సంబంధం లేదని చెప్పారన్నారు. పరిశ్రమ పురోభివృద్ధికి ప్రభుత్వం ఇచ్చే సూచనలు, సలహాలు పాటించేందుకు తాము సిద్ధమని నిర్మాతలు చెప్పారని మంత్రి నాని వివరించారు.
రాజకీయ వివాదాల్లోకి సినీ పరిశ్రమను లాగొద్దు
ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ సినీ పరిశ్రమ సమస్యలను మంత్రి పేర్ని నానికి వివరించడం జరిగిందన్నారు. సినీ రంగం చాలా సున్నితమైందనీ, ఏ పరిణామమైనా ముందు సినీ పరిశ్రమపై పడుతుందన్నారు. సినీ పరిశ్రమ సమస్యలప గతంలో పెద్దలు సీఎం జగన్ ను కలిశారనీ, సమస్యల పరిష్కారం విషయంలో సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారని దిల్ రాజు పేర్కొన్నారు. సినీ పరిశ్రమను రాజకీయాల్లోకి, వివాదాల్లోకి లాగొద్దని విజ్ఞప్తి చేశారు. మంత్రి పేర్ని నానితో జరిగిన భేటీలో దిల్ రాజుతో పాటు బన్నీ వాసు, సునీల్, నారంగ్, వంశీరెడ్డి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.