MLA Alla Rama Krishna Reddy: వైసీపీ రాజ్యసభ సభ్యుడు, రాంకీ గ్రూప్ అధినేత అయోధ్య రామిరెడ్డి సంస్థల్లో ఇటీవల ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించి పెద్ద ఎత్తున అక్రమ లావాదేవీలు జరిగాయని తేల్చిన సంగతి తెలిసిందే. కృత్రిమ నష్టాలు చూపి ఆ సంస్థ పన్నులు ఎగ్గొట్టినట్లు ఐటీ శాఖ తెలిపింది. అయితే ఈ వ్యవహారాన్ని పురస్కరించుకుని ఆయోధ్య రామిరెడ్డి సోదరుడు, మంగళగిరి వైసీపీ ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)పై టీడీపీ విమర్శలు గుప్పించింది. రాంకీ గ్రూపు షేర్లకు సంబంధించి తనపై వచ్చిన ఆరోపణలను ఆర్కే ఖండించారు.
ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. తాను ఏనాడూ ఒక్క రూపాయి అవినీతికి పాల్పడలేదనీ, పాల్పడబోనని ఆర్కే స్పష్టం చేశారు. 2006లో తాను రాంకీ సంస్థలో ఉద్యోగం చేశానని చెప్పిన ఆర్కే 2006 నుండి 2021 వరకూ రాంకీ గ్రూపు లో తనకు ఏ విధమైన షేర్లు లేవని తెలిపారు. కంపెనీ షేర్లు, మూలధనం ఏమిటో టీడీపీ నేతలు తెలుసుకోవాలన్నారు. దుగ్గిరాలలో ఎక్కడ అవినీతి జరిగిందో దమ్ముంటే నిరూపించాలని టీడీపీ నేతలకు ఆర్కే సవాల్ విసిరారు.
ఇన్ సైటర్ ట్రేడింగ్ ద్వారా రాంకీ గ్రూపు కంపెనీల్లో వందల కోట్ల ప్రజా ధనాన్ని దోచుకున్నారనీ టీడీపీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు నిన్న ఆరోపించారు. తన అన్న అయోధ్య రామిరెడ్డి కంపెనీల్లో తమ్ముడు, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి భాగస్వామిగా 12వేల షేర్లు ఉన్నాయని ఆయన పేర్కొన్న సంగతి తెలిసిందే.