MLA Chevireddy: మంత్రి పదవి ఆశిస్తున్న చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి సీఎం జగన్ బిగ్ షాక్ ఇచ్చారు. కొత్త మంత్రుల జాబితా కసరత్తులో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఈ రోజు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. తిరుపతి జిల్లా నుండి జగన్ కు అత్యంత సన్నిహితుడైన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, సీనియర్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిలు మంత్రి పదవులను ఆశిస్తున్నారు. రెడ్డి సామాజికవర్గం నుండి తీవ్రమైన పోటీ ఉన్న నేపథ్యంలో వీరి ఇద్దరికీ అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే చెవిరెడ్డి భాస్కరరావు తుడా (తిరుపతి అర్బన్ డవలప్ మెంట్ అథారిటీ) చైర్మన్ గా ఉన్నారు. ఈ ఏడాది జూన్ 12 వ తేదీ నాటికి ఆయన పదవీ కాలం ముగియనుంది.
MLA Chevireddy: తుడా చైర్మన్ పదవిని మరో రెండేళ్లు పొడిగిస్తూ..
సోమవారం నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం జరగనున్న నేపథ్యంలో అనూహ్యంగా చెవిరెడ్డి తుడా చైర్మన్ పదవిని మరో రెండేళ్లు పొడిగించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో చెవిరెడ్డి పేరు కొత్త మంత్రుల జాబితాలో లేనట్లు స్పష్టం అవుతోంది. వైసీపీ ఆవిర్భావం నుండి చెవిరెడ్డి భాస్కరరెడ్డి క్రియాశీలకంగా పని చేస్తున్నారు. తొలుత 2014 లో మరల 2019 ఎన్నికల్లో వైసీపీ నుండి ఎమ్మల్యే గా గెలిచారు. ప్రస్తుతం ప్రభుత్వ విప్ గా, తుడా చైర్మన్ గా ఉన్నారు. సీఎం జగన్ కు సన్నిహితుడు కావడంతో ఈ సారి చెవిరెడ్డికి తప్పనిసరిగా మంత్రి పదవి వరిస్తుందని ఆయన అభిమానులు భావిస్తూ వచ్చారు. ఈ తాజా పరిణామంతో చెవిరెడ్డి అభిమానులు నిరుత్సాహానికి గురవుతున్నారు.