MLA Prasanna Kumar Reddy: ఏపిలో సినిమా టికెట్ల వివాదంపై అధికార వైసీపీ, సినీ పరిశ్రమ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. రిపబ్లిక్ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో ఆరంభమైన వార్ వరుసగా అటు సినీ పరిశ్రమ నుండి ఇటు ప్రభుత్వంలోని మంత్రులు, వైసీపీ నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ), మంత్రి పేర్ని నాని మధ్య ట్వీట్ ల వార్ ముగిసి నేడు నేడు మంత్రి నానితో ఆర్జీవీ భేటీ జరుగుతున్న విషయం తెలిసిందే. సినీ పరిశ్రమ నుండి ఎవరూ మాట్లాడవద్దు, ప్రభుత్వంతో చర్చించి సానుకూలంగా సమస్య పరిష్కరించుకుందామని ప్రముఖ నిర్మాత దిల్ రాజు సూచన చేసిన తరువాత ఆర్జీవీ లైన్ లోకి వచ్చి సినిమా టికెట్ ధరలను నిర్ణయించే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిదంటూ ప్రశ్నించడంతో మళ్లీ సమస్య మొదటికి వచ్చింది.
ఆర్ నారాయణ మూర్తి చొరవతో…
ఇప్పటికే కోర్టు ఆదేశాల మేరకు టికెట్ ధరల నిర్ణయానికి ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. గత నెలలో నిర్మాత, నటుడు ఆర్ నారాయణ మూర్తి ఆధ్వర్యంలో ఎగ్జిబిటర్లు మంత్రి పేర్ని నానిని కలిసి చర్చించడంతో థియేటర్లపై దాడుల విషయంలో సానుకూల నిర్ణయాన్ని ప్రకటించారు. నెల రోజులు సమయం ఇస్తూ ఈ లోపు అన్ని అనుమతులు తెచ్చుకోవాలని సూచించారు. ఫిలిమ్ ఛాంబర్ ప్రతిపాదనలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ త్వరలో టికెట్ ధరలను నిర్ణయిస్తుందని మంత్రి పేర్ని నాని వెల్లడించారు. సమస్య ఇంతటితో కొలిక్కి వస్తుందనుకున్న దశలో ఆర్జీవీ మాట్లాడటం, దానికి ప్రభుత్వం నుండి కౌంటర్ లు ఇవ్వడం తెలిసిందే.
MLA Prasanna Kumar Reddy: సినిమా వాళ్లకు ఏపి అంటే గుర్తుందా..?
తాజాగా నెల్లూరు జిల్లా కొవ్వూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ సినిమా వాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. అసలు సినిమా వాళ్లకు ఏపి అంటే గుర్తుందా..? అని ప్రశ్నించారు. టిక్కెట్ రేట్లు తగ్గిస్తే సామాన్యులు కూడా పెద్ద సినిమాలు చూస్తారన్న ప్రభుత్వ నిర్ణయంలో తప్పేమిటని అన్నారు. సోమవారం కోవూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న నల్లపురెడ్డి..మీడియాతో సినిమా వాళ్ల గురించి మాట్లాడారు. సినిమా వాళ్లు అంతా హైదరాబాద్ లో ఉన్నారనీ, వారికి ఏపి కనిపిస్తుందా..? అని ప్రశ్నించారు.
వివాదాస్పద వ్యాఖ్యలు కొత్తకాదు
ప్రసన్న కుమార్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తకాదు. ఇంతకు ముందు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపైనా ఆరోపణలు చేశారు. రెండు నెలల క్రితం భారీ వర్షాలు, వరదల సమయంలోనూ సినీ హీరోలను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు సినీ సెలబ్రిటీలు స్పందించాలనీ, హీరోలు విరాళాలు ఇవ్వాలనీ కోరారు. ఆ తరువాత కొద్ది రోజులకే మహేష్ బాబు, చిరంజీవి తదితర హీరోలు రూ.25 కోట్ల వంతున వరద బాధితుల కోసం సీఎం సహాయ నిధికి విరాళాలను అందించారు. కాగా నల్లపురెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రధాన హీరోల అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.