గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చాలా రోజుల తర్వాత నేడు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి (జగన్) ను కలిశారు. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లి జగన్ తో భేటీ అయ్యారు. ఇటీవల గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై జరిగిన సమీక్షా సమావేశానికి హజరు కాకపోవడంపై వివరణ ఇచ్చినట్లు తెలుస్తొంది. రాష్ట్రంలో ఇటీవల హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు అంశం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్శిటీగా ప్రభుత్వం పేరు మార్చింది. అయితే ఈ ప్రతిపాదన సమయంలో సీఎం జగన్ కు వల్లభనేని వంశీ ఈ అంశంపై పునరాలోచన చేయాలంటూ లేఖ రాసినట్లు వార్తలు వచ్చాయి.
ఈ బిల్లులో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సమయంలోనూ వల్లభనేని వంశీ పాల్గొనలేదు. అసెంబ్లీ సమావేశాల నుండి వంశీ ఎవరికీ అందుబాటులో లేరు. సెల్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో సన్నిహితులు సైతం ఎటు వెళ్లారో .. ఎక్కడ ఉన్నారో చెప్పలేకపోయారు. నియోజకవర్గ నేతలకు అందుబాటులో లేరు. దీంతో సోషల్ మీడియాలో పలు రకాలుగా కథనాలు వచ్చాయి. ఎన్టీఆర్ కుటుంబానికి వీరాభిమాని అయిన వంశీ .. హెల్త్ యూనివర్శిటీకీ పేరు మార్పు చేయడంతో అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వినబడ్డాయి. అందుకే నియోజకవర్గానికి దూరంగా ఉన్నారనీ, గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కూడా నిర్వహించడం లేదని అనుకున్నారు. దాదాపు పదిహేను రోజులకు పైగా వంశీ ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి నెలకొంది.
అయితే వంశీ ఈ రోజు సీఎం క్యాంప్ కార్యాలయంలో ప్రత్యక్షం కావడంతో ఆయన అసంతృప్తిని వీడారని వార్తలు వినబడుతున్నాయి. అనారోగ్య కారణంగా కొంత కాలంగా నియోజకవర్గానికి దూరంగా ఉండాల్సి వచ్చిందనీ, ఈ నెల 18 నుండి నిరంతరాయంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తానని సీఎం జగన్ కు వంశీ చెప్పినట్లు సమాాచారం. ఇదే క్రమంలో నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వంతెనల నిర్మాణం, వివిధ అభివృద్ధి పనుల గురించి సీఎం జగన్ కు వివరించి నిధులు, అనుమతులు మంజూరు చేయాలని కోరారని తెలుస్తుంది. ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించారని వంశీ తెలిపారు.
ఎమ్మెల్యే వంశీ ఎక్కడ..? వారం రోజులుగా సైలెంట్.. తీవ్ర అసంతృప్తి..?