MLC Elections : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం అయ్యింది. ఏపిలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు, తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. ఏపిలోని కృష్ణా – గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఓట్ల లెక్కింపు కాకినాడ జెఎన్టీయూ, గుంటూరు ఏసి కళాశాలలో నిర్వహిస్తున్నారు.
తెలంగాణలో మహబూబ్నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు హైదరాబాద్ లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో కొనసాగుతుండగా, వరంగల్లు – ఖమ్మం- నల్లగొండ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు నల్లొండలోని అర్జాలబావి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాముల్లో చేపట్టారు. ఈ రెండు నియోజకవర్గాల్లో పోటీలో నిలిచిన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ఉండటంతో పాటు పోలింగ్ కూడా భారీగా జరగడంతో ఫలితాల వెల్లడి అయ్యేందుకు ఒకటిన్నర నుండి రెండు రోజుల వరకూ సమయం పట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. మహబూబ్నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానంలో 93 మంది పోటీ చేయగా 3,57,354 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వరంగల్ – ఖమ్మం – నల్లగొండ నియోజకవర్గంలో 71 మంది అభ్యర్థులు పోటీ చేయగా 3,86,320 మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఇక ఏపిలోని కృష్ణా – గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 19 మంది, ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 11 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో 30,972 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉండగా 28.622 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
సాధారణ ఎన్నికలతో పోలిస్తే ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ భిన్నంగా ఉంటుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లు 50 శాతంకు పైగా వచ్చినవారు విజేత అవుతారు. ఎవరికీ 50 శాతం ఓట్లు రాకపోతే ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కిస్తారు. అక్కడా ఫలితం తేలకపోతే తృతీయ ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారు. ఇలా చేయాల్సిన పరిస్థితి వస్తే ఫలితం తేలేందుకు దాదాపు 24 గంటలు పట్టే అవకాశం ఉంది. ఇందు కోసం మూడు ఫిప్ట్ ల్లో సిబ్బంది లెక్కింపుల్లో పాల్గొంటున్నారు.