MLC Elections : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఏపిలో ఉభయ గోదావరి, కృష్ణా – గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉదయం 8గంటలకు ప్రారంభం అయ్యింది. అదే విధంగా తెలంగాణలోని మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్, వరంగల్లు – ఖమ్మం – నల్లగొండ స్థానాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయ్యింది. పోలింగ్ సాయంత్రం 4గంటల వరకూ కొనసాగుతుంది.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ లో భాగంగా షేక్ పేట తహశీల్దార్ కార్యాలయం పోలింగ్ కేంద్రంలో తెలంగాణ మంత్రి కేటిఆర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యావంతులు అందరూ సమర్ధులకే ఓటు వేయాలని కోరారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలని, విద్యావంతులు ఎన్నికలకు దూరంగా ఉంటారన్న ఆపోహను తొలగించాలని ఆయన కోరారు. మహబూబ్ నగర్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇటు ఏపి లో ఉపాధ్యాయులు, అటు తెలంగాణలో పట్టభధ్రులు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.