MAA Elections: మువీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, యువ నటుడు మంచు విష్ణు ప్యానల్ పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు ప్యానల్ మధ్య రసవత్తర పోరు నడుస్తోంది. జూనియర్, సీనియర్ సినీ కళాకారులు తమ తమ ప్యానల్ గెలుపునకు విస్తృతంగా ప్రచారం చేస్తూ మా సభ్యులను కలిసి ఓట్లు అభ్యర్ధిస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ మా ఎన్నికలపై బహిరంగంగా కామెంట్స్ చేయని ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు హాట్ కామెంట్స్ చేశారు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో మోహన్ బాబు తన దైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు అధ్యక్షుడుగా పోటీ చేస్తున్న నేపథ్యంలో మోహన్ బాబు చేసిన కామెంట్స్ సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి.
MAA Elections: మాలో నీచ నికృష్ణ రాజకీయాలు
తెలిసిన వాడు, తెలియని వాడు, వెధవలు, క్యారెక్టర్ లేని వాళ్లు కొంత మంది అదేదో కిరీటం అనుకుని, అద్భుతం అనుకుని ఏవేవో మాట్లాడుతున్నారని మోహన్ బాబు విమర్శించారు. నీచ, నికృష్ణ, దరిత్రగొట్టు, భష్టు రాజకీయాలు మా ఎన్నికల సందర్భంగా నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత పచ్చిగా మోహన్ బాబు వ్యాఖ్యానించడంతో ఎవరెవరిని ఉద్దేశించి మాట్లాడారా అనే దానిపై సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. నిజానికి తన కుమారుడు మంచు విష్ణును మా ఎన్నికల్లో పోటీ చేయించాలని తాము అనుకోలేదన్నారు. కొన్ని ప్రత్యేక కారణాల వల్ల మంచు విష్ణు పోటీ చేయాల్సి వచ్చిందని మోహన్ బాబు తెలిపారు. సినీ పరిశ్రమలో ఇప్పుడంతా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉందనీ, ఎవరిష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్నారని తెలిపారు. అయితే గజరాజు వెళుతుంటే కుక్కలు మొరగడం సహజమేననీ, ప్రతి వాటికి బదులివ్వాల్సిన అవసరం లేదని మోహన్ బాబు అన్నారు.
చిరు కుటుంబంపై ఆసక్తికర కామెంట్స్
చిరంజీవితో తన స్నేహం చెక్కు చెదరదన్నారు మోహన్ బాబు,. ఎప్పటికీ చిరు తన స్నేహితుడేనని స్పష్టం చేసిన మోహన్ బాబు చిరు కుటుంబం నుండి మా ఎన్నికల్లో పోటీ చేసి తనతో ఎన్నికలకు సంబంధించి ప్రతిపాదన తీసుకువచ్చి ఉంటే విష్ణును పోటీ నుండి విరమింపజేసే వాడినని అన్నారు. చిరంజీవి, నాగబాబు, అల్లు అరవింద్ పిల్లలను తన పిల్లలుగానే భావిస్తానని పేర్కొన్నారు మోహన్ బాబు, మా ఎన్నికల్లో ఇన్ని పరిణామాలు జరగకపోయి ఉంటే తన కుమారుడు విష్ణును చిరంజీవి ఇంటికి తీసుకువెళ్లేవాడినని అన్నారు. కృష్ణ వద్దకు వెళ్లి అశీస్సులు మాత్రమే తీసుకున్నామని తెలిపారు.