రాష్ట్రంలో కరోనా కేసులు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. మరి కొద్ది రోజుల్లో వాక్సిన్ కూడా అందుబాటులోకి వస్తుంది, కరోనా గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు అనుకుంటున్న తరుణంలో బ్రిటన్ లో తీవ్ర కలకలాన్ని రేకేట్టిస్తున్న కొత్త రకం కరోనాతో మళ్ళీ భయందోళనలు మొదలు అయ్యాయి. బ్రిటన్ తో సహా మరో నాలుగు దేశాల్లో స్ట్రెయిన్ ప్రభావం చూపడంతో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. వివిధ దేశాలతో పాటు భారత్ కూడా యూ కే విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే యూకేలో కరోనా స్ట్రెయిన్ కలకలం మొదలు కావడంతో భారతీయులు ఎక్కువ మంది స్వదేశానికి పయనమై వచ్చారు.
ఈ క్రమంలో యూకే నుండి 1214 మంది ఏపికి వచ్చారు. వారిలో 1158 మంది అడ్రస్ లను అధికారులు గుర్తించారు. 1101 మందిని హోమ్ క్వారంటైన్ లో ఉండమని అధికారులు సూచించారు. మరో 56 మంది ఆచూకి అధికారులకు లభించలేదు. ఏపీకి వచ్చిన ప్రయాణికులకు పరీక్ష నిర్వహించగా, వారిలో ఆరుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తూర్పు గోదావరి, కృష్ణా, అనంతపురం, నెల్లూరు లలో ఒక్కొక్కరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, గుంటూరు జిల్లాలో ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. వీరికి సోకింది కొత్త రకం కరోననా లేక కోవిడ్ 19 వైరస్ ఏనా అనేది తెలుసుకునేందుకు శాంపిల్స్ ను పరీక్షల నిమిత్తం పుణేలోని వైరాలజీ ల్యాబ్ కు పంపారు.
కరోనా కొత్త వైరస్ పై అపోహలతో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపి వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. కొత్త వైరస్ ఇంకా నిర్ధారణ కాలేదని, రిపోర్టు రావాల్సి ఉందని అన్నారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన బాధితులను కోవిడ్ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. యూకే నుండి వచ్చిన వారు తప్పనిసరిగా 14 రోజులు క్వారంటైన్ లో ఉండాలని ఆయన స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ సూచనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.