YS Avinash Reddy: కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణకు వెకేషన్ బెంచ్ నిరాకరించింది. దీంతో అవినాష్ ని అరెస్టు చేయడానికి సీబీఐకి అడ్డంకి తొలగిపోయినట్లు అయ్యింది. మెన్షలింగ్ లిస్ట్ లో ఉంటేనే విచారణ చేస్తామని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అనిరుథ్ బోస్ ధర్మాసనం తెలిపింది. రేపు మెన్షనింగ్ ఆఫీసర్ ముందుకు వెళ్లాలని న్యాయమూర్తి జస్టిస్ అనిరుధ్ బోస్ దర్మాసనం సూచించింది. న్యాయమూర్తి సంజయ్ కరోల్ ధర్మాసనం ముందు విచారణకు వేయవద్దని మెన్షనింగ్ ఆఫీసర్ కు ధర్మాసనం సూచించింది.
ఇంతకు ముందు హైకోర్టు వెకేషన్ బెంచ్ ను తన బెయిల్ పిటిషన్ ను విచారించేలా ఆదేశించాలంటూ సుప్రీం కోర్టులో అవినాష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారణ తేదీని సుప్రీం కోర్టు ఖరారు చేయలేదు. జూన్ రెండో వారంలో విచారణకు అనుమతిస్తామని చెప్పిన సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం వెల్లడించింది. ఇవేళ సీబీఐ అవినాష్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశం ఉందని వార్తలు వినబడుతున్న నేపథ్యంలో మళ్లీ సుప్రీం కోర్టు వెకేషన్ బెంచ్ ముందు తన బెయిల్ పిటిషన్ ను అవినాష్ రెడ్డి మెన్షన్ చేశారు. హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందు బెయిల్ పిటిషన్ దాఖలు చేసేంత వరకూ తనను సీబీఐ అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీం కోర్టును కోరుతున్నారు అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులు రేపు మళ్లీ సుప్రీం కోర్టు వెకేషన్ బెంచ్ ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు.