MP Raghurama: వైసీపీ నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణం రాజు ఆ పార్టీకి, సీఎం జగన్మోహనరెడ్డికి పెద్ద తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయనపై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ ఓంబిల్లాకు ఆ పార్టీ పార్లమెంట్ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఎంపి సభ్యత్వం రద్దు చేయకుండా ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేస్తే స్వతంత్ర అభ్యర్థిగా కొనసాగే అవకాశం ఉన్నందున పార్టీ ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. ఆయన లోక్ సభ సభ్యత్వం రద్దు అయిన తరువాత పార్టీ నుండి సస్పెండ్ చేయాలన్న ఆలోచనలో పార్టీ ఉన్నట్లు సమాచారం. అయితే వైసీపీ అధికార వైసీపీ అధికార వెబ్ సైట్ లో ఉన్న ఎంపిల జాబితా నుండి నర్సాపురం నుండి గెలుపొందిన రఘురామ కృష్ణంరాజు పేరు మాయం అయ్యింది. దీంతో ఆయనను అధికారికంగా తొలగింపు ప్రక్రియకు వైసీపీ చర్యలు చేపట్టిందా అన్న చర్చ జరుగుతోంది.
వైసీపీ అధికార వెబ్ సైట్ నుండి ఎంపిల జాబితాలో రఘురామ కృష్ణం రాజు పేరును తొలగించడంపై ఆయన స్పందించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డికి లేఖ రాశారు. వైసీపీ నుండి తనను బహిష్కరించారా అన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. పొరబాటున పేరు తొలగించారా లేక కావాలనే చేశారా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని రఘురామ కోరారు. కావాలనే తన పేరును వెబ్ సైట్ నుండి తొలగించినట్లయితే పార్టీ నుండి బహిష్కరించినట్లు భావిస్తాననీ పేర్కొన్నారు. 48 గంటల్లో తన పేరు చేర్చకపోతే పార్లమెంట్ సెక్రటేరియట్ దృష్టికి తీసుకువెళతానని లేఖలో పేర్కొన్నారు. ఈ క్రమంలో తనకు తాను స్వతంత్ర అభ్యర్థిగా ప్రకటించుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు రఘురామ.
వైసీపీ అధికార వెబ్ సైట్ లో రాజ్యసభ, లోక్ సభ కు కలిపి మొత్తం 28 పేర్లు ఉండాలి. తిరుపతి నుండి ఇటీవల గెలిచిన గురుమూర్తి పేరును లిస్ట్ లో పెట్టారు గానీ రఘురామ పేరు జాబితాలో లేదు. లిస్ట్ లో 27 పేర్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఇది ఏపి రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఎంపి రఘురామ బహిష్కరణపై స్పష్టమైన హామీ లాంటిది ఏమైనా వచ్చి ఉంటుందా అందుకే ఆయన పేరును తొలగించి ఉండవచ్చా అనే చర్చ జరుగుతోంది.