టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ అధికారులు పలువురు బీజేపీ ప్రముఖులు, న్యాయవాదులకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఏపికి చెందిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు నోటీసులు అందినట్లు వార్తలు వచ్చాయి. ఈ అంశంపై ఎంపి రఘురామ స్పందించారు. సిట్ నోటీసులు అందాయని తెలిపారు. ఢిల్లీలోని తన నివాసంలో సిట్ నోటీసులు అందజేశారని ఆయన పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 29న బంజారాహిల్స్ లోని సిట్ కార్యాలయంలో విచారణకు హజరుకావాలని నోటీసులో పేర్కొన్నట్లు చెప్పారు.
కేసు దర్యాప్తులో భాగంగా ఎంపీ రఘురామకు సంబంధించి పలు కీలక విషయాలను సిట్ సేకరించినట్లుగా భావిస్తున్నారు. అందుకే ఆయనకు 41 ఏ సీఆర్పీసీ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తొంది. అయితే ఇప్పటికే ఈ కేసులో రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజీలు నిందితులుగా ఉండగా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, బీడీజేఎస్ నేత తుషార్, కేరళకు చెందిన వైద్యుడు జగ్గుస్వామి, కరీంనగర్ న్యాయవాది శ్రీనివాస్ లను నిందితుల జాబితాలో సిట్ అధికారులు కొత్తగా చేర్చారు. రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజీల కస్టడీ గడువు నేటితో పూర్తి కావడంతో ఏసీబీ కోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. ముగ్గురు నిందితులకు డిసెంబర్ 9వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపి హైకోర్టు న్యాయవాదుల విధుల బహిష్కరణ.. కోర్టు బయట ఆందోళన .. ఎందుకంటే..?