MP RRR Case: వైసీపీ రెబల్ ఎంపి రఘురామకృష్ణం రాజుపై ఏపి సీఐడి రాజద్రోహం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అరెస్టు సందర్భంలో పోలీసులు వ్యవహరించిన తీరు, కస్టడీ విచారణలో జరిగిన పరిణామాలపై రఘురామకృష్ణం రాజు తనయుడు భరత్ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాకు లేఖ రాశారు.
తన తండ్రి హైదరాబాద్ లో ఉన్న సమయంలో ఏపి సీఐడీ చీఫ్ పివి ప్రవీణ్ కుమార్ నాయక్ సారథ్యంలోని పోలీసులు నిర్ధాక్షిణ్యంగా, అమర్యాదకరంగా, హక్కులకు భంగం కలిగేలా వ్యవహరించారని అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. అరెస్టు సమయంలో కనీస నిబంధనలు కూడా పాటించలేదన్నారు. మే 14న అరెస్టు చేయడంతో పాటు తన తండ్రి పట్ల అమానుషంగా వ్యవహరించారనీ, తన తండ్రి నడవలేని విధంగా కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాము ఇప్పటికే న్యాయపోరాటం చేస్తున్నామనీ, గుంటూరు సీఐడి కోర్టులో తమ వాదనలు వినిపించామన్నారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తన తండ్రి పై కుట్ర జరుగుతోందనే అనుమానం వస్తోందనీ అన్నారు. పోలీసుల ప్రవర్తించిన తీరుపై ఇప్పటికే కోర్టు దృష్టికి తీసుకువెళ్లామని పేర్కొన్నారు.
ఈ విషయంలో తమ న్యాయవాదులు హైకోర్టు, సుప్రీం కోర్టు ద్వారా కూడా పోరాడుతున్నామని పేర్కొన్న భరత్..రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు పౌరులకు న్యాయం ప్రసాదించేలా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. ఈ లేఖతో పాటు ఎఫ్ఐఆర్ కాపీ, తన తండ్రి కాలి గాయాలకు సంబంధించిన ఫోటో, కోర్టు ఉత్తర్వుల ప్రతిని జత చేశారు.
మరో పక్క సీఐడీ పోలీసులు కొట్టారన్న రఘురామ కృష్ణం రాజు ఆరోపించిన నేపథ్యంలో నిజాలు నిగ్గు తేల్చేందుకు గానూ సీఐడీ కోర్టు మెడికల్ బోర్డును ఏర్పాటు చేసింది. మెడికల్ బోర్డు హెడ్ గా గుంటూరు జీజీహెచ్ సూపర్నిటెండెంట్ డాక్టర్ ప్రభావతి నియమితులయ్యారు. సభ్యులుగా మరో ముగ్గురు వైద్యులను నియమించారు. హెడ్ ఆఫ్ ది జనరల్ మెడిసిన్ డాక్టర్ నరసింహం, ఆర్థోపెడిక్ డాక్టర్ వరప్రసాద్, జనరల్ సర్జన్ సుబ్బారావులు ఉన్నారు.
Letter to Home Secretary, Union of India