MP RRR: వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజుకు సీఐడీ అరెస్టు భయం వెంటాడుతోంది. ఏపి ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ ని, ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శిస్తూ వైసీపీకి కొరకరాని కొయ్యగా మారిన రఘురామ కృష్ణంరాజుపై ఇంతకు ముందు రాజద్రోహం తదితర సెక్షన్ ల కింద ఏపి సీఐడీ కేసు నమోదు చేసి అరెస్టు చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఆ తరుణంలో సీఐడీ అధికారుల కస్టడీలో తనపై భౌతిక దాడి జరిగిందనీ ఆరోపించడం, సుప్రీం కోర్టు ద్వారా స్టే తీసుకోవడం విదితమే. సంక్రాంతి పండుగ ముందు ఏపి సీఐడీ అధికారులు హైదరాబాద్ లోని రఘురామ నివాసానికి వెళ్లి విచారణకు హజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు.
MP RRR: రఘురామ ఇంటి వద్దకు ఏపీ సీఐడీ పోలీసులు
అయితే ఆ విచారణకు పిలిచి మరో కేసులో అరెస్టు చేస్తారన్న భయంతో రఘురామ కృష్ణం రాజు నర్సాపురం పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్ నుండి ఢిల్లీకి వెళ్లిపోయారు. అదే సమయంలో రఘురామ కృష్ణంరాజుపై ఏపిలో సీఐడీ డీజీ సునీల్ కుమార్ ను దూషించారన్న అభియోగంపై కేసు నమోదు అయ్యింది. దానిపై ఆయన హైకోర్టును ఆశ్రయించగా స్టే మంజూరైంది. అయితే సీఐడీ విచారణకు అప్పటి నుండి రఘురామ కృష్ణంరాజు హజరు కాలేదు. తన ఆరోగ్యం బాగాలేదని పేర్కొంటూ విచారణకు హజరు అయ్యేందుకు సమయం కావాలంటూ ఏపీసీఐడీకి రఘురామ లేఖ రాశారు. అయితే నెల రోజులు గడచి పోవడంతో ఏపీ సీఐడీ అధికారులు నిన్న మరో సారి హైదరాబాద్ లో రఘురామ ఇంటి వద్దకు వెళ్లినట్లు తెలుస్తోంది.
పోలీసుల కళ్లు కప్పి ఢిల్లీకి
హైదరాబాద్ లో ఆర్ ఎస్ఎస్ నేత దత్తాత్రేయ హాస్బోలే కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రఘురామ కృష్ణంరాజు వచ్చారు. తన నివాసం సమీపంలో ఏపి పోలీసులు నిఘా పెట్టిన విషయం తెలుసుకున్న రఘురామ కృష్ణంరాజు వారి కళ్లు కప్పి ఢిల్లీకి వెళ్లిపోయారు. పార్లమెంట్ సమావేశాలు కూడా జరుగుతున్నాయని సీఐడీ అధికారులకు లేఖలో పేర్కొన్నప్పటికీ తనను అరెస్టు చేసేందుకు ఇంటి వద్ద ఏపి పోలీసుల నిఘా పెట్టారంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు రఘురామకృష్ణం రాజు లేఖ రాశారు. రఘురామపై ఇంతకు ముందు కూడా పలు పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు అయ్యాయి. వాటిపైనా ఆయన కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. అయినప్పటికీ అరెస్టు భయంతో ఆయన ఏపికి రావడం లేదు. దాదాపు రెండు సంవత్సరాలుగా రఘురామ తన నియోజకవర్గంలోనూ అడుగుపెట్టడం లేదు.