MP RRR letter to CM YS Jagan: రఘురామ కృష్ణం రాజును పార్లమెంట్ నుండి బయటకు పంపి ఇరుకున పెట్టాలని వైసీపీ, వైసీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్ ను ఇరుకున పెట్టాలని రఘురామ చేస్తున్న ప్రయత్నాలు ఏపి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ మారుతున్నాయి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కారణంగా రఘురామ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని గతంలోనే వైసీపీ పార్లమెంటరీ నేతలు లోక్ సభ స్పీకర్ ఓంబిల్లాకు లేఖ అందించిన విషయం తెలిసిందే. మరో సారి తాజాగా వైసీపీ లోక్ సభ విప్ మార్గాని భరత్ మరో సారి స్పీకర్ ను కలిసి ఆ ఫిర్యాదు విషయాన్ని గుర్తు చేస్తూ మరో వినతి పత్రాన్ని అందించారు.
ఇదిలా ఉంటే సుప్రీం ఆదేశాల నేపథ్యంలో రచ్చ బండ కార్యక్రమం నిర్వహించడం కుదరకపోవడంతో రఘురామ గత మూడు రోజులుగా సీఎం జగన్ కు లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కొక్క హామీని గుర్తు చేస్తూ రోజుకో లేఖ జగన్ కు రాస్తున్నారు రఘురామ. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 90 శాతం పైగా నెరవేర్చామని సీఎం వైఎస్ జగన్ తో సహా మంత్రులు, వైసీపీ నేతలు ప్రకటనలు చేస్తుండగా, అమలుకాని హామీలను రఘురామ ఎత్తి చూపుతున్నారు. వృద్ధాప్య ఫించన్ల విషయంతో పాటు సీపీఎస్ విధానం రద్దు చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరుతూ రఘురామ ఇప్పటికే రెండ లేఖలు రాయగా, తాజాగా పెళ్లి కానుక, షాదీ ముబారక్ పథకాల విషయాన్ని గుర్తు చేస్తూ మూడో లేఖ రాశారు.
Read More: Sajjala Ramakrishna Reddy: టీడీపీ విమర్శలపై ఘాటుగా సమాధానమిచ్చిన సజ్జల
ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే పెళ్లి కానుక సాయం పెంచుతామని వైసీపీ ఎన్నికల ముందు చెప్పిందన్నారు. ఈ సాయాన్ని కూడా లక్షకు పెంచుతామని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ హామీతో ప్రజల నుండి వైసీపీకి మద్దతు లభించిందనీ, ఇప్పుడు ఆ హామీని వెంటనే నిలబెట్టుకోవాలని అన్నారు రఘురామ. వాస్తవానికి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రన్న పెళ్లి కానుక పథకాన్ని వైఎస్ఆర్ పెళ్లి కానుకగా మార్చారు. ఆర్థిక సహయాన్ని పెంపుదల చేస్తూ జివో కూడా విడుదల చేశారు. కానీ ఎన్నికల ముందు నుండి ఇప్పటి వరకూ జరిగిన వివాహాలకు సంబంధించి ఒక్కరికీ ప్రభుత్వం నుండి సాయం అందలేదు. కాగా మూడు రోజులుగా రఘురామ వరుస లేఖలు రాస్తుండటంతో ఇలా ఇంకా ఎన్ని హామీలకు సంబంధించి లేఖలు రాయనున్నారో అని చర్చించుకుంటున్నారు.