RRR: రాష్ట్రంలో వైసీపీకి, సీఎం జగన్మోహనరెడ్డికి కొరకరాని కొయ్యగా తయారైన రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజు తన రాజకీయ వ్యూహాన్ని తేల్చి చెప్పేశారు. వైసీపీ అధిష్టానం తన పై అనర్హత వేటు వేయిస్తుందో చూద్దాం అని ఇంత కాలం వేచి ఉన్న రఘురామ ఇక తనపై వారు వేటు వేయించలేరని డిసైడ్ అయిపోయారు. అయితే తాను ఎంపీ పదవికి రాజీనామా చేసి నరసాపురంలో మళ్లీ పోటీ చేస్తే గెలుస్తానా లేదా అన్నదానిపై జాతీయ స్థాయి సంస్థలతో ఇటీవల సర్వే చేయించుకున్నట్లు సమాచారం. బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తే పరాజయం ఖాయమని తెలుసు. త్రిముఖ పోటీ జరిగితే వైసీపీకే అడ్వంటేజ్ ఉంటుంది. వైసీపీని వ్యతిరేకించే పార్టీలు అన్నీ రాజుకు సపోర్టు చేస్తే గెలుపు అవకాశాలు ఉంటాయని సర్వే రిపోర్టులు తేల్చి చెప్పాయని సమాచారం.
RRR: సర్వే రిపోర్టు అనుకూలంగా ఉండటంతో
సర్వే రిపోర్టు అనుకూలంగా ఉండటంతో ఇక నాన్చడం అనవసరం అని భావించిన రాజు గారు త్వరలో రాజీనామా చేస్తానని ప్రకటించేశారు. అమరావతే రాజధానిగా కొనసాగించాలన్న డిమాండ్ తో రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధం కావాలని రఘురామ భావిస్తున్నారు. ఇటీవల తిరుపతిలో జరిగిన అమరావతి రైతుల బహిరంగ సభలో రఘురామ పాల్గొని ప్రసంగించారు. అమరావతి రైతుల ఉద్యమానికి వైసీపీ మినహా అన్ని రాజకీయ పక్షాలు మద్దతు తెలిపిన నేపథ్యంలో తాను ఆ కాజ్ తో పోటీ చేస్తే ఇతర రాజకీయ పక్షాలు అన్నీ మద్దతు తెలుపుతాయని ఆశతో ఉన్నారు.
RRR: రెండు సార్లు బీజేపీ అభ్యర్ధులు గెలుపు
నర్సాపురం పార్లమెంట్ కు గతంలో టీడీపీ మద్దతు పోటీ చేసిన బీజేపీ అభ్యర్ధులు గెలిచారు. 1999లో కృష్ణంరాజు, 2014లో గోకరాజు గంగరాజు బీజేపీ అభ్యర్ధులుగా గెలిచారు. అంతకు ముందు టీడీపీ తరపున 1984 నుండి 96వరకూ భూపతిరాజు విజయకుమర్ రాజు మూడు సార్లు, కొత్తపల్లి సుబ్బారాయుడు ఒక సారి విజయం సాధించారు. 2009లో ప్రజా రాజ్యం పార్టీ అభ్యర్ధి పోటీలో ఉండటంతో టీడీపీ అభ్యర్ధిపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి గెలుపొందగా, 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్ధిగా నాగబాబు పోటీ చేయడంతో టీడీపీ పై వైసీపీ తరపున పోటీ చేసిన రఘురామ కృష్ణంరాజు 31వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈ ఎన్నికల్లో జనసేన అభ్యర్ధి నాగబాబుకు రెండున్నర లక్షల పైచిలుకు ఓట్లు పోల్ అయ్యాయి. 2009లోనూ ప్రజారాజ్యం పార్టీ అభ్యర్ధికి రెండున్నర లక్షలకుపైగా ఓట్లు వచ్చాయి. ఈ లెక్కల ఆధారంగా టీడీపీ, జనసేన సపోర్టు చేస్తే గెలుపు ఖాయమన్న భావనలో రఘురామ ఉన్నారు. ఆ ధీమాతోనే కదనరంగంలోకి దిగేందుకు సిద్ధం అవుతున్నారు.