MP RRR Case: రాజద్రోహం తదితర నేరారోపణలపై ఏపి సీఐడీ అరెస్టు చేసిన నర్సాపురం ఎంపి రఘురామకృష్ణం రాజుకు సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. బెయిల్ లభించిన నేపథ్యంలో ప్రస్తుతం సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రఘురామ కృష్ణం రాజును ఈ రోజు విడుదల చేసే అవకాశం ఉందని ఆయన తరపు న్యాయవాదులు భావించారు.
దీంతో వారు గుంటూరు జిల్లా కోర్టుకు వెళ్లి ఆర్మీ ఆసుపత్రి నుండి రఘురామను విడుదల చేయాలని అభ్యర్థించారు. అయితే రఘురామ ఆరోగ్య పరిస్థితి గురించి ఆర్మీ ఆసుపత్రి వైద్యులను మెజిస్ట్రేట్ ఆరా తీశారు. రఘురామ డిశ్చార్జ్ సమ్మరీని సమర్పించాలని ఆర్మీ వైద్యులకు సూచించారు. రఘురామకు మరో నాలుగు రోజులు వైద్యం అవసరమని వైద్యులు మెజిస్ట్రేట్ కు తెలియజేసినట్లు సమాచారం. దీంతో వైద్యులు తుది నివేదిక ఇచ్చిన తరువాతనే రఘురామ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రఘురామ బయటకు రావడానికి నాలుగు రోజులు సమయం పట్టనున్నది. రఘురామ ఆరోగ్యం మెరుగుపడినట్లు ఆర్మీ అధికారులు దృవీకరించిన తరువాతనే కోర్టు బెయిల్ పూచికత్తులు తీసుకుని విడుదలకు ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది.