MP RRR: ఓ పక్క రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జనసేనతోనే మా పొత్తు, ప్రయాణం అని చెబుతోంది. జనసేన చూస్తే టీడీపీకి దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తోందని వార్తలు వినబడుతున్నాయి. ఆ పార్టీ నేతల అంతర్గత సంభాషణల్లో ఈ విషయాన్ని వెల్లడిస్తూనే ఉన్నారు. టీడీపీతో కలిసే ప్రసక్తిలేదు అన్నట్లుగా బీజేపీలోని కొందరు నాయకులు తేగేసి చెబుతున్నారు. ఈ మూడు పార్టీల పరిస్థితి ఇలా ఉండగా వైసీీపీకి, సీఎం వైఎస్ జగన్ కు కొరకరాని కొయ్యగా తయారైన రెబల్ ఎంపి రఘురామ కృష్ణ రాజు సంక్రాంతి పండుగ నాటికి ఓ సంచలన నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారని సమాచారం. రఘురామపై ముందుగా అనర్హత వేటు వేసి ఆ తరువాత సస్పెండ్ చేయాలని వైసీపీ అధిష్టానం భావిస్తున్నా వీరు చేసిన ఫిర్యాదుపై లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా చర్యలు తీసుకోవడం లేదు. కేంద్రంలోని బీజేపీ పెద్దల ఆశీస్సులు ఉండటం వల్లనే ఆయనపై అనర్హత వేటు పడటం లేదన్నది అందరూ అనుకుంటున్న మాట.
MP RRR: ఎంపి పదవికి రఘురామ రాజీనామా..?
ఇక విషయానికి వస్తే త్వరలో తన ఎంపి పదవికి, వైసీపీకి రఘురామ రాజీనామా చేసి అధికారికంగా కాషాయ తీర్ధం పుచ్చుకోనున్నారని వార్తలు వినబడుతున్నాయి. ఈ విషయాన్ని రఘురామ అధికారికంగా ప్రకటించలేదు కానీ ఆయన తన సన్నిహితుల వద్ద దీనిపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. జనవరి నెలాఖరు నాటికి యుపీతో సహా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యుల్ విడుదల అయ్యే అవకాశం ఉందని వార్తలు వినబడుతున్నాయి. ఈ లోపుగా రఘురామ తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే ఆరు నెలల్లోగా ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఆ క్రమంలో మార్చి, ఏప్రిల్ నెలలో జరిగే యూపి ఎన్నికలతో పాటు నర్సాపురం లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుంది.
బీజేపీ – జనసేన అభ్యర్ధిగా
ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ – జనసేన పొత్తు ఉన్న నేపథ్యంలో ఆయన బీజేపీ అభ్యర్ధిగా బరిలో దిగే అలోచన చేస్తున్నారని సమాచారం. మరో పక్క ప్రధాన ప్రతిపక్షం టీడీపీతోనూ మాట్లాడుకుని పోటీ లేకుండా చేసుకుని వైసీపీలో డైరెక్ట్ ఫైట్ కు సిద్ధం కావాలన్నది ఆయన రఘురామ ఆలోచనగా ఉందట. దీనికి సంబంధించి సంక్రాంతి పండుగ నాటికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. రఘురామ బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తే టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాల స్టాండ్ ఏమిటి అనేది కూడా తెలిపోనుంది.