MP RRR Vs Ys Jagan: ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణం రాజు మరో లేఖాస్త్రాన్ని సంధించారు. నిన్ననే ఫించన్ల హామీని గుర్తు చేస్తూ లేఖ రాసిన రఘురామ నేడు మరో లేఖ రాశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కోరారు. వైఎస్ జగన్ తన పాదయాత్ర సమయంలో సీపీఎస్ విధాన్ని రద్దు చేస్తానని వాగ్దానం చేశారనీ, ఆ హామీతో ఉద్యోగులు వైసీపీకి మద్దతు ఇచ్చారని లేఖలో పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏడు రోజుల్లో తాను వాగ్దానాన్ని నెరవేరుస్తాననీ జగన్ హామీ ఇచ్చారనీ, కానీ జగన్ సీఎం గా బాధ్యతలు చేపట్టి 765 రోజులు అయినా కూడా ఈ వాగ్దానం నెరవేర్చడంలో విఫలం అయ్యారని అన్నారు.
Read More: Viral Video: రెండేళ్లలోనే ఈ వాలంటీర్ ఎంత రాటుదేలిపోయిందో చూడండి..
ఏపి సీఐడీ అరెస్టుకు ముందు రఘురామ ఢిల్లీలో రోజు రచ్చబండ నిర్వహిస్తూ వైసీపీ ప్రభుత్వంపైనా, సీఎం జగన్ పైనా ఆరోపణలు, తీవ్ర స్థాయి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీం కోర్టు బెయిల్ కండీషన్ లో మీడియా ముందు మాట్లాడటానికి వీలులేదని పేర్కొనడంతో రచ్చబండ కార్యక్రమానికి పురిస్టాప్ పెట్టిన రఘురామ ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన హామీలను రోజుకు ఒకటి బయటపెడుతూ లేఖలు రాస్తున్నారు. ఏదో రూపంలో మీడియాలో ఉంటున్నారు.
అంతకు ముందే తన అరెస్టు, తదనంతర పరిణామాలను లోక్ సభ స్పీకర్, పలువురు కేంద్ర మంత్రులను కలిసి వివరించడంతో పాటు ఎంపీలకు లేఖలు రాసి తనపై అక్రమంగా రాజద్రోహం కేసు నమోదు చేసిన విషయాన్ని తెలియజేసిన విషయం తెలిసిందే. దీంతో పలువురు ఎంపిలు రఘురామపై సీఐడీ కస్టడీలో జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు.