మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మరో మారు రేపు సీబీఐ విచారణను ఎదుర్కొనున్నారు. ఇప్పటి వరకూ నాలుగు సార్లు సీబీఐ అధికారులు ఆయనను ప్రశ్నించారు. అయిదవ సారి విచారణకు సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేయగా అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. కోర్టులో పిటిషన్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో సీబీఐ విచారణను వాయిదా వేసింది. నిన్న సీబీఐ విచారణ అవినాష్ రెడ్డి హజరు కాలేదు. దీంతో ఈ వేళ సాయంత్రం నాలుగు గంటలకు విచారణ చేస్తామని సీబీఐ తెలిపింది. అయితే నిన్న, ఇవేళ తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై వాదనలు వాడివేడిగా జరిగాయి. ముందస్తు బెయిల్ మంజూరు చేయవద్దని సీబీఐ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.
ఈ కేసులోని వివేకా కుమార్తె సునీత ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఇవేళ సునీత తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇవేళ సాయంత్రం వరకూ వాద ప్రతివాదనలు జరుగుతున్న నేపథ్యంలో అవినాష్ రెడ్డి విచారణను రేపటికి వాయిదా వేసింది. రేపు ఉదయం 10.30 గంటలకు అవినాష్ రెడ్డిని విచారిస్తామని పేర్కొంది. ఈ మేరకు ఆయనకు సమాచారం ఇచ్చారు. రాజకీయ కారణాలతోనే భాస్కరరెడ్డి, అవినాష్ రెడ్డిలను ఈ కేసులో ఇరికిస్తున్నారనీ, వివేకా హత్యతో వీరికి ఎటువంటి సంబంధం లేదని అవినాష్ రెడ్డి న్యాయవాది వాదనలు వినిపించారు. వివేకా హత్య జరగడానికి నాలుగు కారణాలు ఉన్నాయని పేర్కొన్నారు.
కుటుంబ వివాదాలు, ఆర్ధిక వివాదాలు, అక్రమ సంబంధాలు ఇలా నాలుగైదు కోణాలు ఉన్నాయనీ, సీబీఐ ఆ దిశగా దర్యాప్తు చేయడం లేదని అన్నారు. అవినాష్ రెడ్డి న్యాయవాది వాదనలను సీబీఐ తరపు న్యాయవాది తోసిపుచ్చుతూ విచారణ సక్రమంగా జరుగుతోందనీ, కోర్టులను ఆశ్రయిస్తూ దర్యాప్తును ఆలస్యం చేస్తున్నారనీ, విచారణకు సహకరించడం లేదని తెలిపారు. అవసరమైతే అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తామని కూడా సీబీఐ తెలిపింది. దీంతో కోర్టు తీర్పు ఏ విధంగా వస్తుంది. రేపటి విచారణకు అవినాష్ రెడ్డి హజరు అవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. అవినాష్ రెడ్డి న్యాయవాది, సునీత తరపు న్యాయవాది మధ్య కోర్టులో వాగ్వివాదం జరిగినట్లుగా వాార్తలు వెలువడ్డాయి.
చిన్నారిపై లైంగిక దాడి ఘటన కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు