Katti Mahesh: నటుడు, సినీ విమర్శకుడు కత్తి మహేష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే. సోమవారం ఆయన స్వగ్రామమైన చిత్తూరు జిల్లా యల్లమందలో అంత్యక్రియలు జరిగాయి. కత్తి మహేష్ అంత్యక్రియలకు హజరైన ఎంఆర్పిఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ తొలుత ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం మంద కృష్ణ మీడియాతో కత్తి మహేష్ మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సంచలన కామెంట్స్ చేశారు.
కత్తి మహేష్ మరణంపై ప్రభుత్వం విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. కారు ముందు కూర్చున్న కత్తి మహేష్ తీవ్ర గాయాలు అయి మృతి చెందగా, కారులో పక్కనే ఉన్న వ్యక్తికి చిన్న గాయం కూడా లేకుండా ఎలా బయటపడ్డారని ప్రశ్నించారు. కత్తి మహేష్ కు అనేక మంది శత్రువులు ఉన్నారని మందా కృష్ణ అన్నారు. ప్రమాదంలో కారు కత్తి మహేష్ కూర్చున్న వైపే డ్యామేజ్ కావడం అనుమానాలకు తావు ఇస్తోందన్నారు.
ప్రమాదం జరిగిన తరవాత కత్తి మహేష్ కు పెద్దగా గాయాలు లేవన్నారనీ, తరువాత సోషల్ మీడియాలో ఆయన గురించి దారుణమైన కామెంట్స్ వచ్చాయని మంద కృష్ణ అన్నారు. కత్తి మహేష్ మరణంపై నిజాయితీ గల ఉన్నతాధికారులతో గానీ సిట్టింగ్ జడ్జితో గానీ విచారణ జరిపించాలని కోరారు. 15 రోజుల పాటు ఆసుపత్రిలో జరిగిన ట్రీట్మెంట్ వివరాలు బయటకు రావాలన్నారు. ఇది ప్రమాదమా లేక మరణం వెనుక మిస్టరీ ఏమైనా ఉందా నిగ్గు తేల్చాలని మంద కృష్ణ కోరారు.